పాపులర్ గాయకుడు ఉదిత్ నారాయణ్ వ్యక్తిగత జీవితం మరోసారి పెను వివాదంలో చిక్కుకుంది. ఆయన మొదటి భార్యగా చెప్పుకునే రంజనా నారాయణ్ ఝా, ఉదిత్ నారాయణ్పై షాకింగ్ ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..
రంజనా ఝా చేసిన అత్యంత తీవ్రమైన ఆరోపణ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 1996లో వైద్య చికిత్స నెపంతో తనను ఢిల్లీలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లి, తన అంగీకారం లేకుండానే గర్భాశయాన్ని తొలగించారని ఆమె పేర్కొన్నారు. సర్జరీ గురించి తనకు అప్పట్లో తెలియదని, ఇటీవల వేరే ఆరోగ్య సమస్య కోసం వైద్యులను సంప్రదించినప్పుడు మాత్రమే ఈ విషయం బయటపడిందని ఆమె వాదిస్తున్నారు. తన భర్త ఉదిత్ నారాయణ్, ఆయన సోదరులు, రెండవ భార్య దీపా నారాయణ్ కలిసి ఈ కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. బీహార్లోని సుపాల్ మహిళా పోలీస్ స్టేషన్లో 11 ఫిబ్రవరిన ఆమె లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. వైవాహిక మోసం, నేరపూరత కుట్ర, శారీరక, మానసిక వేధింపుల కింద కేసు నమోదు చేయాలని కోరారు.
ఉదిత్ మాజీ భార్య రంజనా ఝా కథనం ప్రకారం.. 1984లో ఉదిత్ నారాయణ్తో ఆమెకు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఆ తర్వాత ఆయన ముంబై వెళ్లి పేరు ప్రఖ్యాతులు సంపాదించాక తనను విస్మరించారని ఆమె ఆరోపిస్తూ వస్తున్నారు. 2006లో మొదటిసారి ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పుడు, ఉదిత్ నారాయణ్ ఆమెను భార్యగా గుర్తించడానికి నిరాకరించారు. కానీ రంజనా ఆధారాలు చూపడంతో, చివరకు ఆమెను తన మొదటి భార్యగా అంగీకరించి ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. గత ఏడాది కూడా రంజనా కోర్టును ఆశ్రయించారు. ఉదిత్ నారాయణ్ తన ఆస్తులను అక్రమంగా అమ్ముకున్నారని, తనకు నెలకు ఇచ్చే రూ. 25,000 నిర్వహణ ఖర్చులు సరిపోవడం లేదని పేర్కొన్నారు.
పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి ప్రాథమిక విచారణను ప్రారంభించారు. అయితే, ఆరోపణలు మూడు దశాబ్దాల క్రితం (1996) నాటివి కావడంతో ఇందులో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఉదిత్ నారాయణ్ లేదా ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఈ ఆరోపణలపై అధికారిక స్పందన రాలేదు.