ఇటీవలి కాలంలో సల్మాన్ ఖాన్, రోహిత్ శెట్టి లాంటి బాలీవుడ్ ప్రముఖులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తీవ్రమైన హత్యా బెదిరింపులు ఎదురైన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరినీ గ్యాంగ్ స్టర్ల ఎటాక్ నుంచి కాపాడేందుకు ముంబై పోలీసులు చాలా ప్రయత్నిస్తున్నారు. అయితే సెలబ్రిటీల బెదిరింపుల ఫర్వం ఆగేట్టు లేదు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టిని డబ్బు పంపకపోతే చంపేస్తామంటూ బెదిరించిన తర్వాత, ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ని చంపేస్తామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపింది.
రణ్ వీర్ ని కోట్లలో డిమాండ్ చేస్తూ ఒక వాట్సాప్ వాయిస్ మెసేజ్ వచ్చింది. తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కి చెందిన వాళ్లం అంటూ వారు హెచ్చరించారు. దీంతో ముంబై పోలీసులు హుటాహుటీన రణ్ వీర్ ఇంటికి భద్రతను ఏర్పాటు చేసారు. రణ్ వీర్ అతడి సతీమణి దీపిక పదుకొనేకు ఇతర కుటుంబ సభ్యులు నివశిస్తున్న ఇంటికి సెక్యూరిటీని పెంచారు.
అయితే రణ్ వీర్ ని బెదిరించింది నిజంగానే బిష్ణోయ్ గ్యాంగ్ కి చెందిన వ్యక్తులేనా లేక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్న డాన్ 3 నుంచి అర్థాంతరంగా తప్పుకోవడంతో రణ్ వీర్ 40 కోట్లు పరిహారం చెల్లించాలంటూ ఫర్హాన్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సమస్యను నిర్మాతల గిల్డ్ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది.