ఇటీవలి కాలంలో స్టార్లతో నిర్మాతల గొడవలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ఇంతకుముందు అక్షయ్ కుమార్ హేరాఫేరి 3 నుంచి పరేష్ రావల్ అర్థాంతరంగా తప్పుకోవడంతో అతడిపై 25 కోట్ల మేర నష్టపరిహారం చెల్లించాలంటూ నిర్మాతలు కోర్టుకెక్కడం సంచలనమైంది. చివరి నిమిషంలో అతడు తప్పుకోవడంతో ప్రాజెక్టుకు పెద్ద డ్యామేజీ అయిందని నిర్మాతలు ఆరోపించారు. సెట్లు వేయడం ప్రీప్రొడక్షన్ కోసమే కోట్లు ఖర్చు చేసామని అక్షయ్ కుమార్ కి చెందిన నిర్మాన సంస్థ కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ ఆరోపించింది.
ఇప్పుడు ఇంచుమించు అలాంటి గొడవ మరొకటి బయటపడింది. ఈసారి డాన్ 3 నుంచి రణ్ వీర్ తప్పుకోవడంతో ఫర్హాన్ అక్తర్ నేతృత్వంలోని ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రణవీర్ నుండి రూ.40 కోట్ల పరిహారం కోరుతోంది. సినిమా ప్రీ-ప్రొడక్షన్, సెట్స్ రూపకల్పన, ఇతర టెక్నీషియన్ల కాల్షీట్ల కోసం తాము ఇప్పటికే భారీగా ఖర్చు చేశామని, రణవీర్ చివరి నిమిషంలో తప్పుకోవడం వల్ల ఆ నష్టాన్ని ఆయనే భరించాలని వారు వాదిస్తున్నారు.
అయితే స్క్రిప్ట్ తుది వెర్షన్ తనకు నచ్చలేదని, అందుకే తప్పుకున్నానని రణ్ వీర్ చెబుతున్నారు. ఒక నటుడు సృజనాత్మక కారణాల వల్ల తప్పుకుంటే పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన టీమ్ వాదిస్తోంది.
ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (పిజిఐ) ఈ విషయంలో జోక్యం చేసుకుని రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ ఇది తేలకపోతే కోర్టు వరకు వెళ్లే అవకాశం ఉంది. దురంధర్ సక్సెస్ తర్వాత రణ్ వీర్ తన ప్లాన్ మార్చుకోవడం వల్లనే డాన్ 3 నుంచి తప్పుకున్నాడని ప్రచారమైంది. కానీ రణ్ వీర్ వెర్షన్ వేరొకలా ఉంది.