వైయస్ జగన్ సోదరుడి కుమారుడు వైఎస్ సాహిల్ రెడ్డి వివాహ వేడుక ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయింది. ఇటు ఏపీ-తెలంగాణ, అటు తమిళనాడులోను చర్చనీయాంశమైంది. చెన్నైలో జరిగిన ఈ పెళ్లిలో వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు స్టార్ హీరోలు సూర్య, కార్తీ సందడి చేయడంతో అది ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించింది. సాహిల్ రెడ్డి తండ్రి నారెడ్డి సునీల్ రెడ్డి వైఎస్సార్ సోదరుడు వైఎస్ జార్జి రెడ్డి కుమారుడు. సునీల్ రెడ్డి వ్యాపారవేత్తగా రాణిస్తూనే, వైఎస్ జగన్ వెనుక ఉండి పార్టీ వ్యవహారాల్లో (ముఖ్యంగా ఎన్నికల మేనేజ్మెంట్లో) కీలక పాత్ర పోషిస్తుంటారు.
వధువు వివరాల్లోకి వెళితే.. సాహిల్ రెడ్డి వివాహం మేకపాటి వేదికతో జరిగింది. వధువు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మనవరాలు. దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడైన మేకపాటి పృథ్వీనాథ్ రెడ్డి కుమార్తె అని సమాచారం. ఈ పెళ్లితో రెండు బలమైన రాజకీయ కుటుంబాలు వియ్యం అందుకున్నాయి. జగన్ స్వయంగా వెళ్లి దగ్గరుండి పెళ్లి పనులను పర్యవేక్షించడం ఈ బంధుత్వానికి ఆయన ఇచ్చే ప్రాముఖ్యతను తెలుపుతోంది.
చెన్నైలోనే ఈ పెళ్లి ఎందుకు? అంటే.. సునీల్ రెడ్డి కుటుంబానికి చెన్నైతో దశాబ్దాల కాలంగా విడదీయరాని సంబంధం ఉంది. వారు అక్కడే స్థిరపడటంతో పాటు, వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా అక్కడి నుండే నడిపిస్తున్నారు. అందుకే ఈ వేడుకను చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ (ఈసీఆర్) లో ఉన్న వారి సొంత నివాసంలోనే నిర్వహించారు. ఇక వైయస్ రాజారెడ్డి కుటుంబంతో హీరోలు సూర్య, కార్తీ తండ్రి శివకుమార్ కి గొప్ప అనుబంధం ఉంది.
అలాగే వైయస్ జగన్ చిన్నప్పుడు చెన్నైలో ఉండేవారు. ఆ సమయంలోనే సూర్య, కార్తీ ఇద్దరికీ స్నేహితుడు. వారి మధ్య ఈ అనుబంధం దశాబ్ధాలుగా కొనసాగుతోంది. వైయస్ జగన్ రాజకీయాల్లో ఎదురీదిన వైనంపై హీరో సూర్య పలుమార్లు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.