సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ నేపథ్యంలో రూపొందించిన దృశ్యం ఫ్రాంఛైజీలో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాల్ని సాధించిన సంగతి తెలిసిందే. మలయాళ ట్యాలెంటెడ్ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ రెండు థ్రిల్లర్ సినిమాలను విజయవంతంగా మలచడంలో పెద్ద సక్సెసయ్యారు. దృశ్యం ఫ్రాంఛైజీ సినిమాలు ఇటు తెలుగు, తమిళం, అటు హిందీలోను రీమేకై గ్రాండ్ సక్సెస్ సాధించాయి. మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో వెంకీ, తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగన్ వంటి ప్రముఖ హీరోలు నటించడంతో ఈ ఫ్రాంఛైజీ పేరు మార్మోగింది.
తాజా సమాచారం మేరకు దృశ్యం ఫ్రాంఛైజీ కథ ముగింపునకు వచ్చిందని తెలిసింది. తాజా ఇంటర్వ్యూలో జీతూ జోసెఫ్ దీనిని కన్ఫామ్ చేసారు. దృశ్యం 3 ఈ ఫ్రాంఛైజీలో చివరి సినిమా అవుతుంది. దృశ్యం 4 ని తెరకెక్కించే ఆలోచన లేదని అన్నారు. దీనికి కారణం ఫ్రాంఛైజీ చివరి సినిమా చాలా ఒత్తిడిని పెంచుతుందని, కథ, స్క్రిప్టు పరంగా ఎక్కడ లోటుపాట్లు ఉన్నా, ఫెయిలైనా తన పరువు పోతుందని భావిస్తున్నట్టు జీతూ జోసెఫ్ తెలిపారు.
ఇలాంటి థ్రిల్లర్ కథల్ని విజయవంతం చేయాలంటే సస్పెన్స్ ఎలిమెంట్స్ తో పాటు, కుటుంబ ప్రేక్షకుల భావోద్వేగాలకు అనుగుణంగా వారిని ప్రభావితం చేయాల్సి ఉంటుందని కూడా అతడు వివరణ ఇచ్చారు. ఎక్కడ ఫెయిలైనా చెడ్డ పేరు వస్తుందని భయపడుతున్నానని తెలిపారు. అందుకే ఫ్రాంఛైజీని మూడో సినిమాతోనే ముగించేస్తున్నానని వెల్లడించారు. ముగింపును బలంగా ఉండేలా చూసుకునేందుకు తాను క్లైమాక్స్ ని ఎంతో జాగ్రత్తగా రాసానని తెలిపారు.
మొత్తానికి దృశ్యం 4 ఉండదని దర్శకుడు జీతూ జోసెఫ్ కన్ఫామ్ చేసారు. ప్రస్తుతం మోహన్ లాల్ కథానాయకుడిగా రామ్ అనే భారీ యాక్షన్ చిత్రాన్ని జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్నారు. కేవలం పరువు పోతుందని ఒక విజయవంతమైన ఫ్రాంఛైజీని ముగించేయాలనుకోవడం నిజానికి అతి పెద్ద త్యాగం కిందే చూడాలి.