రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అవకాశాలు వచ్చినంత కాలం బిజీగానే కొన సాగింది. టాలీవుడ్ సహా కోలీవుడ్ లోనూ ఏక కాలంలో ఛాన్సులందుకుని బిజీగా పనిచేసింది. కానీ కాలక్రమంలో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. హిందీ సినిమాలతో బిజీ అయ్యే సరికి అమ్మడు సౌత్ సినిమాలపై బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేసింది.
పాన్ ఇండియా సినిమాల్లో తనకెందుకు అవకాశాలివ్వలేదంటూ ప్లేట్ ఫిరాయించింది. సౌత్ వాళ్లు తన ట్యాలెంట్ ను తక్కువ గా అంచనా వేస్తున్నారంటూ మూతి బిగించింది. కొందరికి మాత్రమే పని గట్టుకుని అవకాశాలు కల్పించడం వెనుక రాజకీయం ఏంటి అంటూ అవేదన వ్యక్తం చేసింది. టాలీవుడ్లో ఉన్నంత కాలం ఏనాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
బాలీవుడ్ కి వెళ్లిన కొన్నాళ్లకే అమ్మడు ఇలా మాట్లాడేసరికి అంతా విస్తుపోయారు. మరి ఇప్పుడు బాలీవుడ్ తో కూడా అమ్మడికి చెడిందో ఏమో తాజాగా హిందీ వాళ్లు సైతం తనపై రాజకీయం చేస్తున్నారంటోంది. పీఆర్ పేరిట కొత్త రకాల గేమ్ లకు తెర తీస్తున్నారని ఆరోపించింది. డబ్బులిచ్చి ప్రచారం చేయించుకుం టున్నారని...ఉన్నది లేనట్లు..లేనది ఉన్నట్లు భూటకపు ప్రచారం చేసుకుని పబ్బం గడిపే వాళ్లు కొందరైతే? వారి కారణంగా అసలైన ప్రతిభావంతులు అవకాశాలకు దూరమవుతున్నారంది.
ప్రత్యేకించి తనకి అవకాశాలు రాకుండా చేస్తున్నారని అమ్మడు ఆరోపించింది. మరి వీటిపై బాలీవుడ్ నుంచి రియాక్షన్ ఉంటుందా? అన్నది చూడాలి. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది. అవి సెట్స్ లో ఉన్నాయి. షూటింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసుకుని ఇదే ఏడాది రిలీజ్ కానున్నాయి.