షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న `కాక్టెయిల్ 2` చిత్రం గురించి ప్రస్తుతం బాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమా కథాంశం గత `కాక్టెయిల్` (2012) కంటే భిన్నంగా, కొంత విప్లవాత్మకంగా ఉండబోతోందని సమాచారం.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఒక సాధారణ త్రికోణ ప్రేమకథ కాదు. ఈ సినిమాలో రష్మిక మందన్న -కృతి సనన్ స్వలింగ సంపర్కులుగా కనిపించబోతున్నారని, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని టాక్. వీరిద్దరి జీవితాల్లోకి షాహిద్ కపూర్ మూడవ వ్యక్తిగా ఎలా ప్రవేశించాడు? అది వారి బంధాన్ని ఎలా ప్రభావితం చేసింది? అనే కోణంలో కథ సాగుతుందట.
దర్శకుడు హోమి అడాజానియా షూటింగ్ పూర్తయిందని జనవరి 31న అధికారికంగా ప్రకటించారు. షాహిద్, కృతి, రష్మికలతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ``ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం`` అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. సెప్టెంబర్ 2026లో విడుదల చేసేందుకు మ్యాడ్లాక్ ఫిలిమ్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఫిబ్రవరి 13న షాహిద్ కపూర్ నటించిన ఓ రోమియో విడుదల కానున్న నేపథ్యంలో ఇరు సినిమాలకు కనీసం ఆరు నెలల గ్యాప్ ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేవలం వివాదాస్పద అంశంపైనే కాకుండా, భావోద్వేగాల మీద కూడా దర్శకుడు హోమి అడాజానియా ఎలా వర్కవుట్ చేస్తారనేది ముఖ్యం. ఒకవేళ రష్మిక - కృతిల మధ్య రొమాన్స్ కేవలం పబ్లిసిటీ కోసమే కాకుండా, కథలో భాగంగా సహజంగా ఉంటే మాత్రం `కాక్టెయిల్ 2` మరో సెన్సేషన్ అవ్వడం ఖాయం.