ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` ది రూల్` పాన్ ఇండియాలో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1800 కోట్ల వసూళ్లతో `దంగల్` తర్వాత సరికొత్త రికార్డు సృష్టించింది. ఇండియా పరంగా చూస్తే ఇదే హాయ్యెస్ట్ వసూళ్ల చిత్రం. `దంగల్` వసూళ్లు అన్ని చైనా నుంచే అధికంగా ఉండటంతో? భారతీయ మార్కెట్ లో `దంగల్` పెద్దగా ప్రభావం చూపని చిత్రంగానే తేలింది.
అలా `పుష్ప 2` ఇండియాలో టాప్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం జనవరి 16న జపాన్ లో భారీ ఎత్తున రిలీజ్ అయింది. జపాన్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు కూడా ఉండటంతో? అక్కడా మంచి ఓపెనింగ్స్ సాధిస్తుందని అంచనాలుండేవి. కానీ ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ లభించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జపాన్ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు గణాంకాల ప్రకారం 886 టిక్కెట్లు మాత్రమే అమ్ముడైనట్లు సమాచారం.
ఇతర అగ్ర భారతీయ హీరోల సినిమాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. `ఆర్ ఆర్ ఆర్` 8,230, సాహో 6,510,కల్కి 2898 ఏడీ 700, పఠాన్ 2,220 టికెట్లు తెగాయి. వీటితో పోలిస్తే `పుష్ప 2` దరిదాపుల్లో కూడా కనిపించలేదనే చెప్పాలి. ఈ సినిమాను జపాన్ లో సైతం టీమ్ ప్రమోట్ చేసింది.
అల్లు అర్జున్, రష్మిక మందన్న స్వయంగా టోక్యో వెళ్లి భారీగా ప్రమోషన్లు నిర్వహించారు. బన్నీ ఏకంగా జపనీస్ భాషలో డైలాగులు చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఇంపాక్ట్ వసూళ్ల రూపంలో ఎక్కడా కనిపించలేదు. ఈ చిత్రాన్ని జపాన్ వ్యాప్తంగా 250 థియేటర్లలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.