వివాదాస్పద జంట శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా ఆర్థిక మోసాలపై ముంబై హైకోర్టులో విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 60 కోట్ల మేర వ్యాపార భాగస్వామి దీపక్ కొఠారీని మోసం చేసిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా జంట కొఠారికి చెందిన నిధిని దుర్వినియోగం చేసారని పోలీసుల విచారణలో తేలింది.
ఆ తర్వాత లుకౌట్ నోటీస్ జారీ చేసారు. అయితే తాము ముందస్తుగా విదేశీ విహారయాత్రకు టికెట్లు కొనుగోలు చేసామని వాదించిన కుంద్రాకు కోర్టులో చుక్కెదురైంది. ఆర్థిక మోసం కేసులో తుది తీర్పు వచ్చే వరకూ దేశం వదిలి వెళ్లేందుకు అవకాశం లేదని తీర్పును ఇచ్చింది. అయితే నేటి వాయిదాలో ముంబై హైకోర్టు ఊహించని కండిషన్ తో శిల్పాశెట్టి- కుంద్రా జంట విదేశీ యాత్రకు వెళ్లొచ్చని డిక్లేర్ చేసింది. 60కోట్లు కోర్టుకు డిపాజిట్ చేసి ఈ జంట తమ విహార యత్రకు వెళ్లొచ్చని తీర్పును వెలువరించింది.
భాగస్వామి దీపక్ కొఠారి నుంచి వచ్చిన కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని తేలిన తర్వాత ఈ కేసు మొదలైంది. రాజ్ కుంద్రా రకరకాల మార్గాల్లో భాగస్వాముల నుంచి తీసుకున్న సొమ్మును తప్పు దారి పట్టించాడని కూడా పోలీసులు విచారణలో తేల్చారు. శిల్పాశెట్టి- కుంద్రా దంపతులపై ప్రస్తుతం సీరియస్ గా దర్యాప్తు కొనసాగుతోంది.