పైరసీకారులు ఒకరిని అరెస్ట్ చేస్తుంటే మరొకరు పుట్టుకొస్తున్నారు. ఓవైపు తమిళ్ రాకర్స్ మాఫియా అరాచకాలను నిలువరించేందుక సైబర్ క్రైమ్ పోలీసు సీరియస్ గా పని చేస్తోంది. ఇప్పుడు తమిళ్ రాకర్స్ ని మించిన పైరసీ మాఫియా గుట్టు రట్టయింది. తెలుగు చిత్రాలు హిట్ : ది థర్డ్ కేస్, సింగిల్ సినిమాల కాపీలను పైరసీ వెబ్సైట్లలో అప్లోడ్ చేశారని ఆరోపిస్తూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) జూన్ 5న హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వేట ప్రారంభించారు.
ఈ వేటలో ఐదుగురు సభ్యులున్న ముఠా గుట్టు రట్టయింది. జూన్ లో వనస్థలిపురం నుండి 29 ఏళ్ల ఏసీ టెక్నీషియన్ జన కిరణ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. అత్తాపూర్లోని ఒక సినిమా హాల్ లోపల కిరణ్ కుమార్ తన మొబైల్ ఫోన్లో `సింగిల్` సినిమాను రికార్డ్ చేశాడు. అతడికి సిరిల్ ఇన్ఫెంట్ రాజ్ గురువు. సిరిల్ మార్గదర్శకత్వంలో పలువురు పైరేట్ లు పని చేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. కుమార్ 40 కి పైగా సినిమాలను రికార్డ్ చేసి టెలిగ్రామ్ ద్వారా బదిలీ చేసాడు.
సిరిల్ ఈ సినిమాలను పలు టొరెంట్లలో అప్ లోడ్ చేసాడు. ఇలా అప్ లోడ్ చేసినందుకు క్రిప్టోకరెన్సీని అందుకున్నాడు. ఒక్కో సినిమాకి 150 - 500 డాలర్ల మధ్య అందుతోందని కుమార్ పోలీసుల విచారణలో తెలిపాడు. బిఇ కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్ అయిన 32 ఏళ్ల సిరిల్ను జూలై 28న కరూర్ అనే ప్రాంతంలో అరెస్టు చేశారు. కుమార్ తరహాలోనే అతడికి దేశవ్యాప్తంగా ఏజెంట్లు ఉన్నారు. ఏజెంట్ల నుండి సినిమాలను తీసుకుని పైరసీ పోర్టల్లకు అప్లోడ్ చేసినట్లు అతడు పోలీసుల విచారణలో అంగీకరించాడు.
2020 నుండి సిరిల్ 550 కి పైగా సినిమాలను పైరసీ వెబ్ సైట్లలో అప్లోడ్ చేశాడు. కొన్నిసార్లు నెలకు 15 సినిమాలు పైగా అప్ లోడ్ చేసాడు. అతను 10 క్రిప్టో వాలెట్లు, మూడు బ్యాంక్ ఖాతాలను మ్యానేజ్ చేస్తున్నాడు. పలు బెట్టింగ్ ప్లాట్ఫామ్లు, ఈ సైట్లలో ప్రకటనలు జారీ చేసి సిరిల్కు నెలకు దాదాపు రూ.9 లక్షలు చెల్లిస్తాయి అని పోలీసుల విచారణలో తేలింది. బీహార్ కి చెందిన అస్లాన్ హిందీ బోజ్ పురి సినిమాలను కాపీ చేస్తూ దొరికిపోయాడు. అలాగే అశ్విన్ కుమార్ అనే టెక్నీషియన్ నేరుగా డిజిటల్ సర్వర్లను హ్యాక్ చేసి సినిమా రిలీజ్ ముందే తొలి కాపీని హైజాక్ చేస్తాడు. తద్వారా అతడు కోట్లు సంపాదిస్తున్నాడని సమాచారం. తమిళనాడులోని సత్యమంగళం నుంచి సుధాకర్ అనే యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.