`ఒరు ఆధార్ లవ్` చిత్రంలో ఒకే ఒక్క వింక్(కన్ను గీటుడు)తో ప్రియా ప్రకాష్ వారియర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతగా ఫేమస్ అయిందో తెలిసిందే. అదే తీరుగా పాపురలైన నటి షెఫాలి జరివాలా. `కాంటాలాగా` పాటతో షెఫాలి వరల్డ్ ఫేమస్ అయింది. ఈ భామ నృత్యాలు, డ్యాన్స్ లో ఈజ్ చూసి బోయ్స్ పిచ్చెక్కిపోయారు. అయితే షెఫాలి 42 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా మరణించడం అభిమానులను కలచివేసింది.
షెఫాలి మరణవార్త క్షణాల్లో దావానలంలా వైరల్ అయింది. శుక్రవారం మిడ్ నైట్ లో షెఫాలి మరణం గురించి ముంబై పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు ఆమె, ఆమె భర్త కుటుంబం నివశించే భవంతికి వెళ్లి ఆరాలు తీసారు. ప్రస్తుతానికి షెఫాలి మరణం వెనక కారణం ఏమిటన్నది ఇంకా తెలియలేదు. పోస్ట్ మార్టమ్ నివేదిక వచ్చిన తర్వాతే నిజాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఈ కేసును అనుమానాస్పద కేసుగా నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది.
అసలు ఏం జరిగింది? అంటే...
అంధేరిలోని తన నివాసంలో షెఫాలీ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆమె భర్త పరాగ్ త్యాగి, కుటుంబ సభ్యులు సమీపంలోని బెల్లేవ్యూ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్కి తరలించారు. కానీ అప్పటికే అక్కడ సిబ్బంది, వైద్యులు ఆమె మరణించిందని ధృవీకరించారు. అనంతరం పోలీసులకు ఒంటి గంట ప్రాంతంలో కుటుంబీకులు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. తదుపరి పోస్ట్ మార్టమ్ నివేదిక కోసం ముంబై కూపర్ ఆస్పత్రికి పంపారని తెలుస్తోంది. ప్రస్తుతానికి మరణానికి కారణం ఇంకా స్పష్టంగా తెలీదని, దర్యాప్తు సాగుతోందని పోలీసులు చెప్పారు. ఆస్పత్రి ఆవరణలో షెఫాలి భర్త పరాగ్ త్యాగి తన భార్య మరణం గురించి తెలిసాక ఒణుకుతూ కనిపించారని, అతడు తీవ్ర దుఃఖంలో ఉన్నాడని హిందీ మీడియాలు కథనాలు ప్రచురించాయి. అయితే ఈ కేసులో నిజా నిజాలేమిటన్నది పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు నిగ్గు తేల్చాల్సి ఉంటుంది.