టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. రకుల్ వ్యాపార నైపుణ్యం ఇప్పుడు చర్చగా మారుతోంది. ఈ అందాల భామ పెళ్లికి ముందే ఫిట్నెస్ జిమ్ములను నిర్వహించి అనుభవజ్ఞురాలిగా మారింది. మునుముందు రకుల్ ఆమె భర్త జాకీ ఫిట్నెస్ రంగంలో మరింతగా తెలివైన పెట్టుబడులు పెట్టే ఆలోచనతో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికోసం ప్రభుత్వాల స్థాయిలో పెద్దల్ని ప్రభావితం చేస్తున్నారనేది హిందీ మీడియాలో టాక్.
నటుడు, నిర్మాత, వ్యవస్థాపకుడు జాకీ భగ్నాని యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రిత్వ శాఖ కీలక వ్యక్తులకు టచ్ లో ఉన్నారు. ఫిట్నెస్ ఔత్సాహికుడైన జాకీ, న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన ఫిట్ ఇండియా కల్ట్ యోగాథాన్ సందర్భంగా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయతో కలిసి కనిపించాడు. మంత్రిత్వ శాఖ కార్యక్రమాలతో జాకీ మునుముందు ములాఖత్ అవుతారనే ప్రచారం సాగుతోంది.
అంతేకాదు ఫిట్నెస్ ఉద్యమం పేరుతో రకుల్ - జాకీ బృందం తమ వ్యాపారాల్ని విస్తరించే అవకాశం ఉందని అంచనా. దీనికోసం జాకీ వద్ద మాస్టర్ ప్లాన్ రెడీగా ఉంది. ప్రభుత్వ పెద్దల నుంచి సహకారం అందే వీలుందని కూడా చెబుతున్నారు. ``ఫిట్నెస్ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన భారతదేశాన్ని చూడాలనే ప్రభుత్వ దార్శనికత నిజంగా స్ఫూర్తిదాయకం. యువత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి`` అని భగ్నానీ పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. అయితే దేశంలోని యువత ఫిట్నెస్ కోసం జాకీ ఈ అర్థవంతమైన కార్యక్రమానికి ప్లాన్ చేయడం ప్రశంసించదగినదే. వీధికో జిమ్, యోగా సెంటర్ ప్రారంభించి సరసమైన ధరలకు అందుబాటులో ఉంటూ అతడు కోచింగ్ ఇస్తే అది ఆహ్వానించదగినదే.
జాకీ భవిష్యత్ ప్లానింగ్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యోగా , ఫిట్నెస్ను యూత్ రోజువారీ దినచర్యలలో చేర్చడానికి ప్రేరేపించడంపై రకుల్- భగ్నానీ జంట దృష్టి సారించే అవకాశం ఉంది. ఇది వారి ఆదాయ మార్గాలను మరింతగా పెంచుతుందని అంచనా. ఇక రకుల్ ప్రీత్ భర్త జాకీ భగ్నానీ సినీనిర్మాతగా తీవ్ర నష్టాలను చవి చూసారని ఇంతకుముందు కథనాలొచ్చాయి. కానీ ఇప్పుడు అతడు తన భార్య రకుల్ కారణంగా ఫిట్నెస్ రంగంలో వ్యాపారాలు నిర్వహించేందుకు అవకాశం ఉందని భావిస్తున్నారు.