ఇటీవలి కాలంలో సినిమా సెట్లలో మాదక ద్రవ్యాలు సేవించే నటీనటుల గురించి కథనాలొస్తున్నాయి. షైన్ టామ్ చాకో, శ్రీనాథ్ బాసి వంటి మళయాల నటులు ఆన్ లొకేషన్ కూడా డ్రగ్స్ సేవిస్తూ సహచరుల కంట పడటం, దానిపై నిర్మాతలకు ఆరోపించడం తెలిసినదే. ఆ ఇద్దరి పైనా అధికారులు, పరిశ్రమ క్రమశిక్షణా కమిటీ విచారణ కూడా జరిగింది.
ఇదిలా ఉంటే, సెట్లలో కానీ, పని చేసే వాతావరణంలో ఎక్కడైనా కానీ, పోస్ట్ ప్రొడక్షన్ ల్యాబ్ లో కానీ.. ఎవరూ డ్రగ్స్ సేవించకూడదని మాలీవుడ్ లో కొత్త నియమాన్ని అమల్లోకి తెస్తున్నట్టు తెలిసింది. దీనికోసం ఆర్టిస్టులు సహా 24 శాఖల కార్మికుల నుంచి కూడా సంతకాలు తీసుకోనున్నారు. పారితోషికం ఒప్పందంలో దీనిని కూడా భాగం చేస్తుండడంతో ఇకపై అందరూ క్రమశిక్షణతో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మలయాళ చిత్రపరిశ్రమ ఆర్టిస్టుల సంఘం (అమ్మా) తొందర్లోనే జనరల్ బాడీ మీటింగ్ లో దీనిని ప్రకటిస్తుందని కూడా చెబుతున్నారు.
డ్రగ్స్ మత్తులో స్త్రీలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నటులపైనా ఇటీవల మలయాళ చిత్రసీమలో ఆరోపణలు వచ్చాయి. కారణం ఏదైనా దీనివల్ల పోలీసులు సెట్లలోకి వచ్చి విచారణ పేరుతో షూటింగులను ఆపేస్తుండడంతో దానివల్ల నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అందుకే నిర్మాతలు ఇప్పుడు ఈ కఠినమైన రూల్ ని పాస్ చేసారు. సెట్స్ లో అన్ని అంతరాయాలకు ఇలా చెక్ పెట్టాలనే ఆలోచన మంచిదే.