ప్రభాస్ సరసన రాజా సాబ్ చిత్రంలో నటిస్తోంది మాళవిక మోహనన్. ఈ బ్యూటీ కొంతకాలం క్రితం ముంబైలో ఓ కఠినమైన అనుభవం ఎదుర్కొంది. ఒక లోకల్ ట్రైన్ లో వెళుతున్నప్పుడు ఒక ఆకతాయి తన వద్దకు వచ్చి ఛుమ్మా ఇస్తావా? అని అడిగాడు. ఆ సమయంలో మాళవిక తన ఇద్దరు స్నేహితురాళ్లు మాత్రమే అక్కడ ఉన్నారు. అతడి చిల్లింగ్ టీజింగ్ ప్రశ్నకు అవాక్కయిన మాళవిక.. ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నామని పేర్కొంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ముంబై మహిళలకు సురక్షితమైన ప్రదేశమని చెబుతుంటారు. కానీ అది తప్పు అని నేను చెప్పదలిచాను! అంటూ ఆ వీడియోలో వ్యాఖ్యానించింది. తనకు ఎదురైన అనుభవాన్ని బహిర్గతం చేసింది. అయితే దీనికి వెంటనే ముంబై పోలీసులు స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ నోట్ రాసారు. లోకల్ ట్రైన్ లో వెళుతున్న మాళవిక వద్దకు వచ్చి దుండగుడు ప్రవర్తించిన తీరు గురించి విన్నామని, అయితే అలాంటి సమయంలో వెంటనే ముంబై పోలీసులకు సమాచారమివ్వాలని, సాధ్యమైనంత వేగంగా స్పందించి మీకు మద్ధతుగా నిలుస్తామని వివరణ ఇచ్చారు. ముంబై సురక్షితం కాదు అని సాధారణీకరించడం సరికాదని అన్నారు. నగరంలో ఎక్కడ ఉన్నా.. ఏ సమయంలో అయినా 112/100 నంబర్లో సంప్రదించండి. మేము వీలైనంత త్వరగా స్పందిస్తాము. నేరస్తుడిని విడిచిపెట్టము. దయచేసి దీనిని అందరికీ తెలియజేయండి అని మాళవికను ముంబై పోలీసులు కోరారు.
మాళవిక నటించిన `రాజాసాబ్` ఈ ఏడాదిలో విడుదల కానుంది. ప్రభాస్ సరసన ఈ భామ తొలిసారి నటిస్తోంది. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మాళవిక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళ చిత్రపరిశ్రమల్లో మాళవిక నటిస్తోంది.