అన్నీ సవ్యంగా సాగి ఉంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లను తెలుగు చిత్రసీమ ప్రముఖులు కలవాల్సి ఉంది. 15 జూన్ సీఎంతో సినీపెద్దల మీటింగ్ ఉంటుందని కథనాలొచ్చినా కానీ, అనూహ్యంగా ఈ సమావేశాన్ని వాయిదా వేసారని తెలుస్తోంది.
ఈ వాయిదాకు కారణమేమిటి? అంటే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్, రెబల్ స్టార్ ప్రభాస్ సహా పలువురు అగ్ర తారలు ఔట్ డోర్ షూటింగుల్లో సుదూర ప్రాంతాల్లో ఉన్నారు. షెడ్యూళ్లను వాయిదా వేసి సమావేశానికి వచ్చే పరిస్థితి కనిపించలేదట. దీంతో సీఎం పేషీని అభ్యర్థించి సమావేశాన్ని వాయిదా వేసారని తెలిసింది.
టాలీవుడ్ ప్రముఖులపై పవన్ కల్యాణ్ గరంగరంగా ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీకి సినీపెద్దలు ప్లాన్ చేయడం ఆసక్తిని కలిగించింది. `హరి హర వీరమల్లు` చిత్రాన్ని విడుదల కానివ్వకుండా కుట్ర చేస్తున్న కొందరిపైనా పవన్ బహిరంగంగానే కోపం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఇకపై నేరుగా వచ్చి తనను కలవడం కుదరదని, ఫిలింఛాంబర్ మధ్యవర్తిత్వంతో మాత్రమే కలవగలరని అల్టిమేటం జారీ చేసారు. ఏడాది కాలంగా పాలనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసేందుకు సినీపెద్దలు రాకపోవడంపైనా పవన్ గుర్రుగా ఉన్నారు. అందుకే ఆయన సీరియస్ గా వార్నింగులు ఇచ్చారు.