నిన్న హైదరాబాద్ శివారు ప్రాంతమైన చేవెళ్ల లోని త్రిపుర రిసార్ట్స్ లో సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి పట్టుపడడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ బర్త్ డే పార్టీలో 50 మందివరకు పాల్గొనగా అందులో ఒకరు గాంజా సేవించినట్లుగా తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసారు. ఫామ్ హౌస్ మేనేజర్, పార్టీ ఇచ్చిన మంగ్లీ, గాంజా తీసుకున్న దామోదర్ రెడ్డిపై కేసులు బుక్ అయ్యాయి.
తాజాగా మంగ్లీ తన బర్త్ డే పార్టీలో ఎలాంటి తప్పు జరగలేదు, అది ఫ్యామిలీ పార్టీనే, అందులో తన ఫ్యామిలీ కూడా పాల్గొన్నట్టుగా చెబుతూ.. ఓ వీడియో రిలీజ్ చేసింది. నా బర్త్ డే పార్టీ ఫ్యామిలీ ఫంక్షన్ మాదిరిగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మా అమ్మానాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు, బంధువులతో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు కూడా ఉన్నారు.
లిక్కర్, సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. లిక్కర్కు, సౌండ్ సిస్టమ్కు అనుమతి తీసుకోవాలనే విషయంపై నాకు అస్సలు అవగాహన లేదు. రిసార్ట్లో పార్టీ అనుకోకుండా.. సడన్గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. నాకు తెలిసి ఉంటే తప్పకుండా అనుమతి తీసుకునే దాన్ని. అనుమతి తీసుకోవాలనే విషయం నాకు ఎవరూ చెప్పలేదు. తెలిసి అయితే.. నేను ఎలాంటి తప్పు చేయలేదు.
రిసార్ట్లో లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు అక్కడ లేవు.. వాడలేదు. పోలీసులు సెర్చ్ చేసినా ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు. గంజాయి తాగినట్టు ఎరికైతే పాజిటివ్ వచ్చిందో ఆ వ్యక్తి వేరే ఎక్కడో .. ఎప్పుడో తీసుకున్నట్టు తేలిందని పోలీసులే చెప్పారు. దానిపై విచారణ కూడా జరుగుతోంది. మేం కూడా పోలీసులకు సహకరిస్తున్నాం అంటూ ఆ వీడియోలో మంగ్లీ చెప్పుకొచ్చింది.