`ఆపరేషన్ సిందూర్` గ్రాండ్ సక్సెస్ తో భారత్ ఆనందంలో ఉంది. కానీ పాకిస్తాన్ లో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. ఉద్యోగాల్లేక అల్లాడుతున్నారు. ఇక పాకిస్తానీ సినీపరిశ్రమ పూర్తిగా బ్యాన్. ఇండియాలో పాకిస్తానీ నటీనటులకు అవకాశాల్లేవ్. కానీ దశాబ్ధాల క్రితమే పాకిస్తానీ గాయకుడు అద్నాన్ సమీ భారతదేశంలో లెజెండరీ గాయకుడిగా పాపులరయ్యాడు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అద్నాన్ తెలుగులో `ఏ జిల్లా ఏ జిల్లా.. `` అంటూ మెగాస్టార్ చిరంజీవి సినిమాకి చార్ట్ బస్టర్ పాటను పాడారు అంటే అతడి ప్రభావం దేశంలోని మూల మూలలకు ఎలా విస్తరించిందో అర్థం చేసుకోవాలి.
అయితే అద్నాన్ సమీ వెయిట్ లాస్ జర్నీ గురించి మనకు తెలిసింది తక్కువ. అతడు ఏకంగా 230 కేజీల బరువుండేవాడు. అంత పెద్ద హెవీ వెయిట్ పర్సనాలిటీ సినీరంగంలో గాయకుడిగా కెరీర్ సాగించడం అసాధారణ ప్రయత్నం. అతడు బరువు సంబంధిత సమస్యలతో తీవ్రమైన అనారోగ్యాలతో పోరాడాడు. ఒకానొక దశలో ఒక ప్రముఖ వైద్యుడు అద్నాన్ మరో ఆరు నెలల్లో చనిపోతాడని చెప్పాడు. మీ అమ్మా నాన్నలకు తెలియకుండా ఏ హోటల్ గదిలోనో ఆర్నెళ్ల తర్వాత చనిపోయి పడి ఉంటావు! అని వైద్యుడు హెచ్చరించాడు. అది కూడా అతడి తల్లిదండ్రుల ముందు.
దానికి వారంతా ఒణికిపోయారు. కానీ అద్నాన్ మాత్రం మొండిగా బేకరీలకు వెళ్లి స్వీట్లు తిన్నానని చెప్పాడు. ఈ వైద్యులు ఇలాగే చెబుతారు.. నమ్మొద్దని తన తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ ఆ క్షణం అద్నాన్ తండ్రి కన్నీటి పర్యంతమై.. నువ్వు నన్ను పాతిపెట్టే రోజు రావాలి కానీ, నా బిడ్డను నేను భూమిలో పాతి పెట్టే రోజు రాకూడదని ఆవేదన చెందాడు. అప్పుడు అద్నాన్ సీరియస్ గా స్పందించాడు. ఎలాగైనా బరువు తగ్గి చూపిస్తానని సవాల్ చేసాడు. అటుపై 120 కేజీల బరువు తగ్గిపోయాడు. దాదాపు సగం బరువు తగ్గాడు. మిగతా 110 కేజీల బరువు నుంచి కూడా ఇంకా తగ్గుతూనే ఉన్నాడు.
అతడు అనూహ్యంగా బరువు తగ్గడంపై విమర్శలున్నాయి. అతడు రకరకాల శస్త్ర చికిత్సలను అనుసరించాడని, కొవ్వు కరిగించుకునేందుకు అధునాతన విధానంలో కత్తిపోటుకు గురయ్యాడని కామెంట్టు చేసారు. కానీ సుశిక్షితుడైన ఫిట్ నెస్ కోచ్ సమక్షంలో ప్రొటీన్ ఆహారం తీసుకుంటూ వ్యాయామాలు చేస్తూ తగ్గానని అద్నాన్ చెప్పాడు.