బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ `మహాభారతం`ని మూడు భాగాలుగా తెరకెక్కిస్తానని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సితారే జమీన్ పర్ ఈనెలలో రిలీజ్ కి వస్తుండగా, అతడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి బహిరంగ వేదికలపై హింట్ ఇస్తున్నాడు. `లాల్ సింగ్ చడ్డా` పరాజయంతో తీవ్రంగా నిరాశకు గురైన అమీర్ ఖాన్ తన కెరీర్ లో అత్యంత సంతృప్తికరమైన ఒక ప్రాజెక్ట్ ని పూర్తి చేసి చనిపోవాలనుందనే కోర్కెను వెలిబుచ్చాడు.
తాజాగా అతడు తన రిటైర్ మెంట్ గురించి ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. మహాభారతం తన చిట్టచివరి సినిమా అవుతుందని అమీర్ ఖాన్ అన్నారు. `సీతారే జమీన్ పర్` విడుదలైన తర్వాత మహాభారతంపై పని చేస్తానని చెప్పిన అమీర్ ప్రస్తుతం దీని సన్నాహకాల్లో ఉన్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మహాభారతం తన `డ్రీమ్ ప్రాజెక్ట్` అని పేర్కొన్నాడు. రాజ్ షమానీతో మాట్లాడుతూ.. ఆమిర్ మహాభారతం తన చివరి ప్రాజెక్ట్ కావచ్చు అని ప్రకటించాడు. ఈ భారీ ప్రాజెక్ట్ నటుడిగా తనను సంతృప్తి పరుస్తుందని భావిస్తున్నానని అమీర్ చెప్పాడు. మహాభారతం తర్వాత తాను ఏమీ చేయలేనని కూడా చెప్పాడు. అన్ని కోణాల్లో ఇది హైగా ఉంటుంది. దర్శకత్వం వహించి కూడా సంతృప్తి పడతాను.. దీని తర్వాత చనిపోతాను అని కూడా అమీర్ ఖాన్ అన్నాడు.
కొద్దిరోజుల క్రితం ది హాలీవుడ్ రిపోర్టర్తో మాట్లాడుతూ ``మహాభారతం తన అతిపెద్ద ఆశయాలలో ఒకటి`` అని అమీర్ వ్యాఖ్యానించారు. రచనా ప్రక్రియకు కొన్ని సంవత్సరాలు పడుతుందని, నిర్మాతలలో ఒకరిగా తాను కొనసాగుతానని చెప్పాడు. సినిమాలో నటిస్తానా లేదా అనేది చెప్పలేను.. ఏ పాత్రకు ఎవరు సూటవుతారో వారిని ఎంపిక చేస్తానని కూడా అమీర్ అన్నారు. అతడు నటించిన లాల్ సింగ్ చడ్డా నిరాశపరిచాక అతడి హోప్స్ అన్నీ తారే జమీన్ పర్ పైనే ఉన్నాయి. ఈ సినిమా ఈ వారంలో విడుదల కానుంది. అమీర్ ఖాన్ ప్రస్తుత వయసు 60. మహాభారతం సిరీస్ పూర్తి చేయడానికి బహుశా మరో 10ఏళ్లు పడుతుంది. అంటే 70 సంవత్సరాలు దాటాక తాను ఉంటానో లేదో అనే సందేహాన్ని అమీర్ వ్యక్తం చేసారన్నమాట!