టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్, లైగర్ లాంటి ఫ్లాప్ సినిమాలను అందించడం అభిమానులను నిరాశపరిచింది. రామ్, దేవరకొండ లాంటి ఎనర్జిటిక్ స్టార్లకు ఫ్లాపులివ్వడంతో పూరీ జగన్నాథ్ పై చాలా ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా అతడి కథల ఎంపిక, స్క్రిప్టు మ్యాటర్స్ సరిగా లేవంటూ విమర్శలొచ్చాయి.
కొంత గ్యాప్ తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ సినిమా తీస్తుండడం సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తోంది. పూరి- ఛార్మి బృందం ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నారు. ఇంతలోనే ఇప్పుడు ఈ జోడీ నేరుగా టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ని కలిసారు. అతడితో కలిసి ఫోటో దిగి దానిని పూరి కనెక్ట్స్ లో షేర్ చేసారు. లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తో ఇలా విలువైన సమయం గడపడం ఆనందాన్నిచ్చిందని ఛార్మి అన్నారు.
అయితే పూరి అకస్మాత్తుగా దేనికోసం విజయేంద్రుడిని కలిసారు? అంటూ ఆరాలు మొదలయ్యాయి. అతడు సేతుపతి సినిమా స్క్రిప్టును రివ్యూ చేయించే పనిలో ఉన్నాడా? లేక తదుపరి సినిమా కోసం విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు ఇస్తున్నారా? అంటూ ఆరాలు తీస్తున్నారు. ఈ పని ఏదో లైగర్ సమయంలో చేసి ఉంటే ఇలాంటి ఫ్లాపిచ్చేవాడివి కాదు కదా! అని కొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ తో మా అన్న రామ్ కి ఫ్లాప్ ఇచ్చావ్.. అప్పుడే విజయేంద్ర ప్రసాద్ ని కలవాల్సింది కదా? అని ఒక అభిమాని ఆవేదన చెందాడు. మొత్తానికి స్టార్ రైటర్ ని పూరి కలవగానే చాలామందిలో ఉత్సాహం మొదలైంది.