80లు 90లలో భారతదేశంలో కరాటేకు ఎంతో క్రేజ్ ఉండేది. అప్పుడప్పుడే మార్షల్ ఆర్ట్స్ గురించి దేశంలో అన్ని మారుమూల ప్రాంతాలకు తెలిసిన రోజులవి. అప్పటికే చైనా ఒలింపిక్స్ లో బంగారు పతకాలు సాధిస్తూ దూసుకుపోతుంటే ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేవి. కానీ అప్పటికి ఒలింపిక్స్ అంటే ఏంటో కూడా తెలీని ధైన్యం భారత్ లో ఉంది. మారుమూలలకు క్రీడా స్ఫూర్తి రగలడానికి చాలా దశాబ్ధాలు పట్టింది.
అయితే ఆ రోజుల్లోనే భారతదేశంలో ఒక స్టార్ తన యాక్షన్ తో , కరాటే విద్యలతో ఆశ్చర్యపరిచారు. ఆయన ఎవరో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వయంగా `సీతా పయనం` సినిమా ప్రచార వేదికపై చెప్పుకొచ్చారు. అప్పట్లో బ్రూస్ లీ పేరు మార్మోగుతున్న సమయంలోనే భారతదేశంలో యాక్షన్ కింగ్ అర్జున్ కి ఎంతో క్రేజ్ ఉండేదని, దేశంలో ఆయన మొదటి కరాటే కింగ్ అని ఉపేంద్ర చెప్పారు. అంతేకాదు అర్జున్ తనకు సినిమా డైలాగ్ లు రాసే అవకాశం కల్పించారని, ఇప్పుడు తన అన్న కొడుకు నిరంజన్ కి హీరోగా అవకాశం కల్పించారని ఉపేంద్ర తెలిపారు. కర్నాటకలో రెండు బ్లాక్ బస్టర్లు కొట్టిన అర్జున్ ఆ తర్వాత తమిళంలోను విజయవంతమైన కెరీర్ ని ప్రారంభించారని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. అర్జున్ తనకు ఎంతో స్ఫూర్తి అని కూడా అన్నారు. తనను ఆంధ్రా కింగ్ అని పిలిచిన అభిమానులనుద్ధేశించి మాట్లాడుతూ, నేను కాదు ఆంధ్రా కింగ్..మీలోనే చాలామంది ఉన్నారు అని కూడా ఉపేంద్ర అన్నారు.
విశ్వక్ సేన్ రిజెక్టెడ్?
సీతా పయనం మూడు భాషల్లో విడదలకు వస్తోంది. నిజానికి యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించాల్సి ఉంది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా అతడు మూవీ నుంచి వైదొలిగాడు. ఆ స్థానంలో ఉపేంద్ర సోదరుని కొడుకు నిరంజన్ హీరో అయ్యాడని గుసగుస ఉంది. అయితే అప్పట్లో ప్రారంభించిన అదే సినిమాలో విశ్వక్ ని నిరంజన్ తో రీప్లేస్ చేసారా? లేక కొత్త కథను దర్శకుడు అర్జున్ ఎంచుకున్నారా? అన్నది ఆయనే స్వయంగా చెప్పాల్సి ఉంది. సీతా పయనంలో అర్జున్ సార్జా కుమార్తె ఐశ్వర్య కథానాయికగా నటించింది. అర్జున్ కజిన్ ధ్రువ సర్జా కీలక పాత్రను పోషించాడు. అర్జున్ దర్శకత్వం వహించారు.