బహిరంగంగా మీడియా చానెళ్ల ముందు, పబ్లిక్ ముందు, పోలీసుల ముందు బాహాబాహీకి దిగిన మంచు బ్రదర్స్ వివాదం గురించి తెలిసిందే. ఇది ఆస్తి తగాదా! అని కొందరు అంటారు. కానీ తాను ఆస్తులు అడగలేదని మంచు మనోజ్ అన్నారు. మనోజ్ ని శంషాబాద్ లోని సొంత ఇంటి లోనికి కూడా రానివ్వలేదు మంచు విష్ణు. ఈ గొడవలో వెటరన్ మోహన్ బాబు చాలా నలిగిపోయారు. ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీంతో మంచు ఫ్యామిలీ డ్రామా ఊహించని ఎంటర్ టైన్మెంట్కి దారి తీసింది. దీనిపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో విస్త్రతంగా చర్చ సాగింది.
అయితే ఈ కలతలు, గొడవలు పరిశ్రమలో మోహన్ బాబు సన్నిహితులకు చాలా ఆవేదనను మిగిల్చాయి. అలాంటి వారిలో ఒకరు సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. మంచు కుటుంబంతో చాలా సన్నిహితంగా మెలిగే అతడిని మంచు బ్రదర్శ్ విష్ణు, మనోజ్, మంచు డాటర్ లక్ష్మీ ప్రసన్న కూడా అంకుల్ అని ఆప్యాయంగా పిలుస్తారు.
ఇప్పుడు కన్నప్ప రిలీజ్ ముందు ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజతో మంచు విష్ణు మనసు విప్పి మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో మంచు కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా బ్రదర్స్ ఇద్దరినీ కలిపే బాధ్యత తాను తీసుకుంటానని తమ్మారెడ్డి అన్నారు. దానికి మంచు విష్ణు నిరభ్యంతరంగా అంగీకరించారు. పెద్దలు చెప్పేది తాను వింటానని విష్ణు ఎంతో వినమ్రంగా అన్నారు. కుటుంబం ఒకటిగా తిరిగి కలిసిపోవాలని విష్ణు కోరుకున్నాడు.
ఏది ఏమైనా మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ లను కలిపేందుకు ఒక్కడుగా వచ్చాడు భరద్వాజా. ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఇంతమంది సన్నిహితులు ఉన్నా ఎవరూ ఆ సాహసం చేయలేదు. అయితే మంచు కుటుంబంలో ఈ ఎపిసోడ్ కి కొంత సమయం పడుతుందని తమ్మారెడ్డి అన్నారు. కన్నప్ప రిలీజైపోయాక భరద్వాజా అన్నదమ్ములను కలిపే ప్లాన్ చేస్తారు. ఈలోగానే మనోజ్ నటించిన భైరవం రిలీజవుతుంది.. ఆ తర్వాత విష్ణు, మనోజ్ ఇద్దరూ కూడా ఫ్రీ. ఇటీవల భైరవం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో యాధృచ్ఛికంగా తన కుటుంబం అంతా మునుపటిలా కలిసిపోవాలని మనోజ్ ఆశపడ్డాడు. ఇప్పుడు మంచు విష్ణు కూడా కలిసిపోయేందుకు సై అనేసాడు. కాబట్టి మంచు బ్రదర్స్ కలుస్తారా లేదా? అన్నది ఇప్పటికి సస్పెన్స్.