ఇప్పుడు సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చేస్తే ఎంతమంది ప్రేక్షకులు ఆ సినిమాని ఆదరిస్తారో చెప్పలేకుండా ఉన్నాము. ఎందుకంటే కరోనా, మరోపక్క బడ్జెట్ పెరిగింది, అప్పుల పాలయ్యాము అంటూ టికెట్ రేట్స్ పెంచమని మేకర్స్ ప్రభుత్వాలకు వేడుకోలు, ఈ పెరిగిన టికెట్ రేట్స్ పెట్టుకుని సినిమా ఎంతమంది చూస్తారు అనే దానిపై స్పష్టత రావడం లేదు. కోట్లు ఖర్చు పెట్టి థియేటర్స్ లో సినిమాని రిలీజ్ చేసాక హిట్ అయితే రెండు వారాలు, ప్లాప్ అయితే మూడు రోజుల ముచ్చటగా తయారైంది సినిమాల పరిస్థితి. భారీబడ్జెట్, గొప్ప సినిమా, క్రేజీ సినిమా, హిట్ టాక్ వచ్చినా కేవలం రెండు వారాలు కలెక్షన్స్ వస్తుంది. అందుకే నిర్మాతలు కూడా మరో మార్గం ఎంచుకుంటున్నారు. అది ఓటిటి డీల్స్, సినిమాల రిలీజ్ అయిన మూడు వారాలకే ఓటిటిలో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు అంటూ ఆ డిజిటల్ రైట్స్ ని కోట్ల డీల్ కి అమ్మేస్తున్నారు.
థియేటర్స్ లో ఆడకపోయినా డిజిటల్ హక్కుల కింద నష్టాన్ని పూడ్చుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో. అదిగో సినిమా రిలీజ్ అయిన మూడు, నాలుగు వారాలకి ఓటిటిలో వచ్చేస్తుంటే.. మనం థియేటర్స్ లో డబ్బు ఖర్చుపెట్టి సినిమా ఏం చూస్తాం లే అనే ఆలోచనలోకి ప్రేక్షకులు వెళుతున్నారు. ఆచార్య నే తీసుకోండి ఏప్రిల్ 29 న రిలీజ్ అవ్వగా.. 20 రోజులకే అంటే మే 20 నే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. రాధే శ్యామ్ అంతే. రిలీజ్ అయిన 15 రోజులకే ఓటిటిలోకి వచ్చేసింది. మరి నిర్మాతలకు అటు థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయ్యి కాసులు రావాలి, ఇటు ఓటిటికి అమ్ముకుని క్యాష్ చేసుకోవాలనే చూస్తున్నారు. అలాంటప్పుడు ప్రేక్షకుల తీర్పుకి నిర్మాతలు కూడా కట్టుబడి ఉండాల్సిందే. అందుకే ఇప్పుడు సినిమా రిలీజ్ ల విషయంలో నిర్మాతలపై ఒత్తిడి పెరిగిపోతుంది. ఎందుకంటే థియేటర్స్ లో రిలీజ్ అయిన చాలా తక్కువ సమయానికే ఓటిటిలో రిలీజ్ చేస్తామంటూ సదరు ఓటిటి వాళ్ళు నిర్మాత లపై ప్రెజర్ పెట్టడం వంటి విషయాలతో నిర్మాతలు నలిగిపోతున్నారు.