ఒకప్పుడు ప్రాంతీయ చిత్ర పరిశ్రమగా పరిమితమైన టాలీవుడ్ నేడు ఇండియన్ సినిమా గమనాన్ని శాసిస్తోంది. బాహుబలి తర్వాత మొదలైన మార్పు మూడవ దశకు చేరుకుంది. తొలి దశలో తెలుగు హీరోలు తమ నటనతో, మలి దశలో దర్శకులు తమ మేకింగ్ స్టైల్తో బాలీవుడ్ను ఆకర్షించారు. తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు నేరుగా హిందీ గడ్డపై పాగా వేస్తున్నాయి. తెలుగు సినిమాల్లోని గ్రాండియర్ - నిర్మాణ విలువలను చూసి బాలీవుడ్ స్టార్లు సైతం మన మేకర్లతో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారు. కేవలం కళగానే కాకుండా? భారీ బడ్జెట్ను ఎలా ఖర్చు చేయాలి? దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి ? అనే పక్కా వ్యాపార వ్యూహాల్లో తెలుగు నిర్మాతలు పండితులు కావడంతో ఉత్తరాది మేకర్లే షాక్ అవుతున్నారు.
టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ వంటి వారు బాలీవుడ్ టాప్ స్టార్లతో భారీ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే సన్నీ డియోల్తో జాట్ వంటి చిత్రాన్ని నిర్మించి విజయాన్ని అందుకుంది. ఈ ట్రెండ్కు ఆద్యుడైన అల్లు అరవింద్ సైతం గజిని వంటి ఇండస్ట్రీ హిట్లను గుర్తు చేస్తూ మళ్లీ హిందీలో స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ మేకర్స్ దగ్గర ఉన్న మాస్ పల్స్ ని నార్త్ మార్కెట్ కి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారు.
భాషా పరమైన విభజనలు తగ్గిపోయి ఇండియన్ సినిమా అంతా ఒకే గొడుగు కిందికి వస్తోన్న తరుణంలో తెలుగు నిర్మాతల ఫోకస్ బాలీవుడ్ పై మళ్లడం శుభపరిణామం. సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు ఇప్పటికే బాలీవుడ్లో తమ ముద్ర వేయగా నిర్మాణ సంస్థలు కూడా అక్కడి యువ హీరోలతో చర్చలు జరుపుతున్నాయి. ఉత్తరాది స్టార్ పవర్ కి టాలీవుడ్ నిర్మాణ విలువలు తోడైతే? ఇండియన్ సినిమా గ్లోబల్ లెవల్లో మరింత దూసుకుపోవడం ఖాయం. రాబోయే ఐదేళ్లలో బాలీవుడ్ స్క్రీన్ పై టాలీవుడ్ బ్యానర్ల సందడి స్పష్టంగా కనిపిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.