టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ ట్యాలెంటెడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం `ది ఇండియా స్టోరీ`. సామాజిక ఇతివృత్తంతో కూడిన నేషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలను పట్టిపీడిస్తున్న ఒక తీవ్రమైన సమస్యను ఆధారంగా చేసుకుని దర్శకుడు చేతన్ డికె ఈ చిత్రాన్ని రూపొందించారు. సాగర్ బి షిండే కథను అందించడమే కాకుండా ఈ ప్రాజెక్టును నిర్మించారు. కేవలం ఒక కుటుంబానికో లేదా ప్రాంతానికో పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో చర్చించాల్సిన ఒక ముఖ్యమైన అంశాన్ని ఈ సినిమాలో బలంగా చూపించబోతున్నారు.
ఈ సినిమా ప్రధానంగా వ్యవసాయ రంగంలో రసాయనాల దుర్వినియోగం.. పురుగుమందుల కల్తీ వల్ల తలెత్తుతున్న భయంకరమైన పరిణామాలను చర్చిస్తుంది. మన కళ్ళ ముందే జరుగుతున్నా చాలా మంది గమనించని ఈ పర్యావరణ .. మానవ సంక్షోభాన్ని ఈ కథలో ఎండగట్టారు. వ్యవస్థలోని లోపాలను, ప్రభుత్వ నియంత్రణ సంస్థల బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తూనే... ప్రజారోగ్యంపై ఇవి చూపుతున్న ప్రభావాన్ని కథలో చూపించనున్నారు. కాజల్ అగర్వాల్- శ్రేయాస్ తల్పాడే తమ నటనతో కథకు ప్రాణం పోశారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం సమాజంలో ఒక అర్ధవంతమైన చర్చకు దారితీస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.