టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కథానాయికల ప్రాధాన్యత మారుతోంది. కేవలం స్టార్ హీరోల పక్కన గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా తమ భుజాల మీద సినిమాను నడిపించే లేడీ ఓరియెంటెడ్ కథల వైపు అగ్ర కథానాయికలు మొగ్గు చూపుతు న్నారు. అనుష్క, నయనతార వంటి సీనియర్లతో పాటు సమంత, రష్మిక మందన్నా కూడా సోలో మార్కెట్ను పటిష్టం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే `అరుంధతి`, `యశోద` వంటి చిత్రాలతో తామేమిటో నిరూపించుకున్న భామలు మరింత వైవిధ్యమైన బలమైన మహిళా పాత్రల కోసం అన్వేషిస్తున్నారు.
గతంలో హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు అంటే కేవలం హారర్ లేదా భక్తిరస చిత్రాలనే ముద్ర ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ , పొలిటికల్ డ్రామాలలో కూడా మహిళలే లీడ్ రోల్స్ పోషిస్తూ మెప్పిస్తున్నారు. తాజాగా సమంత `మా ఇంటి బంగారం` తో, రష్మికా మందన్నా మైసాతో కథాబలమున్న లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులపై ఆసక్తి చూపిస్తోంది. వారు చూపిస్తున్న తెగువతో చిన్న, మధ్య తరహా నిర్మాతలు కూడా కొత్త తరహా కథలతో ముందుకు రావడానికి ధైర్యం చేస్తున్నారు.
అగ్ర హీరోల కాల్షీట్ల కోసం వేచి చూడకుండా? తమకున్న క్రేజ్ను వాడుకుంటూ సొంతంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడం ప్రధాన ఉద్దేశంగా మారుతోంది. సీనియర్ హీరోయిన్లకు ఉన్న ఫ్యాన్ బేస్ , నటనలో ఉన్న పరిణతి ఇలాంటి సినిమాలకు ప్లస్ పాయింట్ అవుతోంది. కేవలం పాటలకే పరిమితం కాకుండా కథను మలుపు తిప్పే పాత్రలు చేయడం వల్ల వారి కెరీర్ నిడివి కూడా పెరుగు తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని భారీ బడ్జెట్ మహిళా ప్రధాన చిత్రాలకు పుష్కలంగా అవకాశాలు కనిపిస్తున్నాయి.