టాలీవుడ్లో ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉన్న రాశీ ఖన్నా కెరీర్ ఇప్పుడు గందరగోళంలో పడింది. తెలుగులో ఆమె ఆశలు పెట్టుకున్న భారీ ప్రాజెక్ట్ `ఉస్తాద్ భగత్ సింగ్` ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో టాలీవుడ్లో ఆమె ప్రస్థానం దాదాపు ముగిసినట్లేనని ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా తెలుగులో సరైన సక్సెస్ లేకపోవడం, కొత్త తరం హీరోయిన్ల పోటీ పెరగడంతో ఇక్కడ ఆమెకు అవకాశాలు దక్కడం కష్టంగా మారింది.
ప్రస్తుతం రాశీ ఖన్నా తన ఫోకస్ను పూర్తిగా ఇతర భాషా చిత్రాలపైనే పెట్టినట్లు కనిపిస్తోంది. అమ్మడు బాలీవుడ్లో మూడు సినిమాలు, తమిళంలో ఒక క్రేజీ ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో ఆఫర్లు తగ్గుముఖం పట్టడంతో, ఇతర ఇండస్ట్రీలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అక్కడ తన మార్కెట్ను సుస్థిరం చేసుకునే ప్రయత్నాల్లోనే కనిపిస్తుంది. హిందీ వెబ్ సిరీస్లు, సినిమాలతో అక్కడ మంచి గుర్తింపు లభిస్తుండటం ఆమెకు కలిసొచ్చే అంశం.
మొత్తానికి ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన మెరిసిన భామ ఇకపై తెలుగు సినిమాల్లో కనిపించడం అరుదే అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న బాలీవుడ్ చిత్రాలు గనుక ఘనవిజయం సాధిస్తే, ఆమె మళ్ళీ ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంటుంది. లేదంటే? రాశీ ఖన్నా ఇకపై బాలీవుడ్ , కోలీవుడ్ కే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.