వైసీపీ హయాంలో జరిగిన తిరుపతి కల్తీ లడ్డు ఎంతగా సెన్సేషన్ సృష్టించిందో అందరికి తెలుసు. దానిని కూటమి ప్రభుత్వం పై రుద్దడానికి వైసీపీ ఎంతగా కష్టపడుతుందో చూస్తున్నారు. ఇప్పుడు తిరుమల నెయ్యి సరఫరా కోసం కొత్త టెండర్లను పిలిస్తే అది హెరిటేజ్ సంస్థకు అనుసంధానము అంటూ లేనిపోని అపోహలను సృష్టిస్తూ హంగామా చేస్తుంది వైసీపీ పార్టీ.
తాజాగా తిరుమల నెయ్యి సరఫరా చేసేందుకు వేసిన కొత్త టెండర్లపై వైసీపీ లేనిపోని తప్పుడు ప్రచారాలు చేయడం ప్రారంభించింది. నోటికి హద్దు, అదుపు లేకుండా అబద్దాలు మాట్లాడుతుంది. ఈ రోజు శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. హెరిటేజ్ కు సంబంధం ఉన్న ఇందాపూర్ డెయిరీకి టెండర్లు అప్పగించారని.. ఇందాపూర్ డైరీ కి రేట్లు పెంచేసి నెయ్యి సరఫరా కాంటాక్ట్ ఇచ్చారంటూ ఒకటే రచ్చ చేస్తోంది వైసీపీ పార్టీ.
కల్తీ నెయ్యి వ్యవహారం విషయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సీరియస్ గా ఉండడమే కాదు ఇప్పుడు నెయ్యి కొనుగోళ్లలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఎంఆర్ ఎల్ స్కోర్ బోర్డు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. నెయ్యి సేకరణను 1500 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్లకు తగ్గించి క్వాలిటీని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ కు సంబంధమే లేదు. ఈ విషయాన్ని బీఆర్ నాయుడు గారు ఆధారాలతో వివరించారు. ఇందాపూర్ డెయిరీ నుంచి హెరిటేజ్ కేవలం చీజ్ మాత్రమే కొంటుంది. చాలా సంస్థలు ఇందాపూర్ డెయిరీ నుంచే కొంటాయి. గతంలో వైసీపీ టెండర్లు కట్టబెట్టిన అమూల్ డెయిరీ కూడా ఇందాపూర్ నుంచే కొనేది. ఇక నందిని డెయిరీని తీసేశారు అని చెబుతున్నది కూడా అవాస్తవం. నందిని డెయిరీ తాము అంత సరఫరా చేయలేము అని చెబితే ఇందాపూర్ కు టెండర్లు ఇచ్చింది టీటీడీ.
ఇందాపూర్ డెయిరీకి రెండు టెండర్లు, సంగం డెయిరీకి ఒకటి మదర్ డెయిరీకి రెండు టెండర్లు ఇచ్చారు. ఇందులో అన్ని పద్ధతులు చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు చెబుతోంది టీటీడీ. కానీ వైసీపీ మాత్రం పనిగట్టుకుని ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తోంది.