నందమూరి తారక రామారావు వీరాభిమాని ఎన్టీఆర్ రాజు గారి అకాల మరణం తెలుగు దేశం పార్టీకి, నందమూరి కుటుంబానికి తీరని లోటని నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం తిరుపతిలో ఎన్టీఆర్ రాజు పార్థివ దేహానికి నందమూరి కుటుంబం తరఫున నివాళులు అర్పించారు. రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
అనంతరం ఎన్టీఆర్ రాజు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నందమూరి వీరాభిమానిగా ఎన్టీఆర్ రాజు ఎనలేని సేవలందించారన్నారు. రెండు సార్లు టీటీడీ బోర్డు మెంబర్ గా ఎన్టీఆర్ రాజు ఎన్నిక కాబడి భక్తులకు విస్తృత సేవలందించారని గుర్తు చేశారు. టీటీడీ అభివృద్ధికి అనేక సూచనలిచ్చినట్లు వారు తెలిపారు. ఆయన మృతి యావత్ నందమూరి అభిమానులకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడ్ని ప్రార్థించారు.