డిఫరెంట్ చిత్రాలతో తనదైన గుర్తింపు దక్కించుకున్న హీరో మంచు మనోజ్ ఇప్పుడు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. రీసెంట్ గా మిరాయ్ తో బిగ్గెస్ట్ కం బ్యాక్ ఇచ్చిన సంగీత పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారాయన. అందులో భాగంగా మంచు మనోజ్ తన కొత్త మ్యూజిక్ ప్రాజెక్ట్ మోహన రాగ మ్యూజిక్ ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.
వెండితెరపై తనదైన నటన, పాత్రలతో విలక్షణ నటుడుగా తెలుగు సినిమాల్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు మంచు మనోజ్. చెల్డ్ ఆర్టిస్ట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. బిందాస్, కరెంట్ తీగ, పోటుగాడు వంటి మాస్ ఎంటర్టైనర్స్తోపాటు ప్రయోగ్రాత్మక చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. సినిమాల్లో తన అభిరుచిని నటనలోనే కాకుండా సొంతంగా స్టంట్స్ కంపోజ్ చేయటం, సెట్స్ రూపకల్పనలో ఇన్వాల్వ్కావటం, గుర్తుండి పోయే పాత్రను రూపొందించటంలో ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు.
గతంలో పోటుగాడు సినిమాలో ప్యార్ మే పడిపోయానే.. పాటను పాడి ప్రేక్షకులను మెప్పించారు. కోవిడ్ సమయంలో అందరినీ ఉత్తేజరపరిచేలా అంతా బాగుంటాంరా పాటను విడుదల చేశారు. మిస్టర్ నూకయ్య చిత్రంలో పిస్తా పిస్తా.. పాటతో పాటు నేను మీకు తెలుసా సినిమాలో ఎన్నో ఎన్నో.. పాటలకు సాహిత్యాన్ని అందించారు.
తెరపై పాటలు పాడటం, రాయటం వంటి సంగీత సంబంధమైన విషయాలే కాదు.. తెర వెనుక ఎన్నో విశేషమైన సేవలను అందించారు. మనోజ్ తన సినీ ప్రయాణంలో తండ్రి డా.మంచు మోహన్ బాబు, అన్నయ్య మంచు విష్ణు, సోదరి లక్ష్మి మంచు చిత్రాలకు సంగీత విభాగంలో వర్క్ చేయటంతో పాటు వారి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను డైరెక్ట్ కూడా చేశారు.
మోహన రాగ మ్యూజిక్ అనేది కొత్త ఆలోచనలు, భావోద్వేగాలను కలిపే వేదిక. ఈ కంపెనీతో మంచు మనోజ్ ఒక కొత్త సృజనాత్మక అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయటం, ప్రయోగాత్మక సంగీతాన్ని ప్రోత్సహించటం..భారతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సరికొత్త సంగీతాన్ని రూపొందించటమే దీని ప్రధాన లక్ష్యం. ఈ పేరుకీ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. తండ్రీ కొడుకులిద్దరికీ అత్యంత ఇష్టమైన రాగం - మోహన రాగం.