కాంతార చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ అగ్ర కథానాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి రిషబ్ శెట్టి హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఓ భారీ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం కాంతార 2 చిత్ర పనుల్లో నిమగ్నమై ఉన్న రిషబ్, ఒక ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా కోసం సితారతో చేతులు కలిపారు. 18వ శతాబ్దంలో భారత్లోని అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్లో ఒక తిరుగుబాటుదారుడు ఎదిగిన క్రమం నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుంది.
మంచి కథకుడిగా పేరు గాంచిన, ప్రతిభావంతులైన అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసారి ఆయన ఓ అద్భుతమైన కథతో ప్రేక్షుకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు.
ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషలలో ఏక కాలంలో చిత్రీకరించబడుతుంది. తెలుగు, కన్నడతో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
ప్రొడక్షన్ నెం.36 గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ నటీనటులు, ప్రతిభగల సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేయనున్నారు.
కేవలం ప్రకటనతోనే భారతీయ సినిమాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను త్వరలో నిర్మాతలు వెల్లడించనున్నారు.