పురాణేతిహాసాలను టచ్ చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. రామాయణం, మహాభారతంపై సినిమాలు తీయడం దర్శకులకు కెరీర్ పరంగా ఎప్పటికీ చూడని అతి పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అలాంటి ఒక ఛాలెంజ్ లో నిరూపించలేక అభాసుపాలయ్యాడు ఓంరౌత్. శ్రీరాముడి కథలో వానరాలను చూపించకుండా, చింపాంజీలను చూపించిన ఘనత ఓంరౌత్ కే చెందుతుంది. ఇది రామయణ కథలోనే లేని వింత. అందుకే ఆదిపురుష్ డిజాస్టరైంది.
ఇప్పుడు నితీష్ తివారీ `రామాయణం` ఎలా ఉండబోతోంది? ఇందులో పాత్రల ప్రవర్తన, తీరుతెన్నులు, కాస్ట్యూమ్స్, టైమింగ్ ప్రతిదీ చాలా కీలకం. కథ, కథనం, డైలాగులు పలికే మాడ్యులేషన్ ఇలా ప్రతిదీ నిశితంగా గమనిస్తారు ప్రజలు. ముఖ్యంగా చాలా సన్నివేశాల్లో గ్రాఫిక్స్ ని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే నితీష్ తివారీ ఈ ఛాలెంజ్ ని ఎలా నిర్వహించారు? అన్నది ఆసక్తిగా మారింది. త్వరలోనే టైటిల్ ప్రకటన కోసం మూడు నిమిషాల వీడియోని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అది ఎప్పుడు వస్తుంది? అన్నది ఇంకా క్లారిటీ లేదు కానీ, నితీష్ రామాయణం ఎలా ఉండబోతోందో స్పష్ఠత వచ్చేస్తుంది ఈ వీడియోతో. బహుశా థియేటర్లలోని ప్రేక్షకులు ఈ సినిమాలో చింపాంజీలను చూడకపోతే కచ్ఛితంగా నితీస్ తివారీ సక్సెస్ సాధించినట్టే.
రెండు భాగాలుగా రూపొందుతున్న రామాయణం చిత్రాలను 2026 దీపావళికి, 2027 దీపావళికి తేవాలనేది ప్లాన్. శ్రీరాముడిగా రణబీర్, సీతగా సాయిపల్లవి, రావణాసురుడిగా యష్, ఆంజనేయుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ ఫ్రాంఛైజీ సినిమాలపై ప్రజల్లో క్యూరియాసిటీ అంతకంతకు పెరుగుతోంది.