గత నెల రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ ను ఆరోగ్యాంద్రగా మార్చాలనే తపనతో యోగాంద్ర పేరుతొ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. స్కూల్స్ లో, పార్కులలో యోగ పై అవగాహన కలిగించేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి ఒక్కరూ యోగ అభ్యసించాలని, ఆరోగ్యం కోసం యోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమవ్వాలని నినాదాలు చేపట్టారు. ఇప్పటివరకు 10 యోగా దినోత్సవాలు ఘనంగా నిర్వహించగా, ఇప్పుడు11వ యోగా దినోత్సవాన్ని విశాఖ నగరంలో జరపడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 21న విశాఖ వేదికగా జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోడీ ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ భావనలతో యోగ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. యోగా మన సాంప్రదాయానికి ప్రతిరూపం మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరి ఆరోగ్య జీవనశైలిలో భాగం. అందరూ యోగ డే ని పురస్కరించుకుని యోగాసనాలు వెయ్యాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరుతున్నారు.
ఈ శనివారం యోగ డే సందర్భంగా విశాఖలో జరగబోయే యోగ డే కార్యక్రమం కోసం యువత వేలల్లో తమ వివరాలను నమోదు చేసుకుంది. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటుగా పలువురు కేంద్రమంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మినిస్టర్ నారా లోకేష్, మిగతా మంత్రులు పాల్గొనున్నారు.