జూన్ 12న థియేటర్లలో అడుగుపెట్టనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం హరి హర వీరమల్లు. ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో హరి హర వీరమల్లు ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినీ అభిమానులంతా ఈ చిత్రం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మూడవ గీతాన్ని ట్రైలర్తో పాటు ఆవిష్కరించడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది. ట్రైలర్ విడుదలతో అంచనాలు నూతన శిఖరాలకు చేరుకుంటాయని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.
అత్యద్భుత స్థాయిలో రూపొందించబడుతోన్న హరి హర వీరమల్లు చిత్రం తుదిదశకు చేరుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, డబ్బింగ్ పనులతో మెరుపు వేగంతో తుది మెరుగులు దిద్దుకుంటోంది.
ఆలస్యాల మధ్య పగ్గాలు చేపట్టిన దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, కొద్ది నెలలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ప్రతి విభాగాన్ని పర్యవేక్షిస్తూ, వెండితెరపై మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించడానికి కృషి చేస్తున్నారు.
ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మాట వినాలి, కొల్లగొట్టినాదిరో గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. చిత్ర బృందం ఎక్కడా రాజీ పడకుండా, ప్రపంచం మెచ్చే గొప్ప చిత్రంగా మలచడానికి కృషి చేస్తోంది.
చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు భాగమయ్యారు. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జిషు సేన్గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న హరి హర వీరమల్లు చిత్రం, జూన్ 12న బాక్సాఫీస్ దగ్గర గర్జించనుంది.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న హరి హర వీరమల్లు సినిమా.. ప్రేక్షకుల హృదయాలను, బాక్సాఫీస్ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది.
తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి.
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ, నిర్మాత: ఎ. దయాకర్ రావు, సమర్పణ: ఎ. ఎం. రత్నం, బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్, సంగీతం: ఎం. ఎం. కీరవాణి, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్.