Advertisement

దర్శకుడిగా నా చివరి సినిమా అదే: దాసరి!

Tue 03rd May 2016 05:35 PM
dasari narayanarao interview,birthday special  దర్శకుడిగా నా చివరి సినిమా అదే: దాసరి!
దర్శకుడిగా నా చివరి సినిమా అదే: దాసరి!
Advertisement

1972లో 'తాతా మనవడు' సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు. సుమారుగా 150 సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ దర్శకరత్న మే 4న తన పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు.

పవన్ తో సినిమా చేస్తున్నా..

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా మొదలు పెడుతున్నాం. కథ సిద్ధంగా ఉంది. త్రివిక్రమ్ కూడా పని చేస్తున్నాడు. అయితే డైరెక్టర్ ఎవరనే విషయాన్ని సస్పెన్స్ గా పెట్టాం. అది కాకుండా మరో మూడు ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించాలనుకుంటున్నాం. అందులో అందరు కొత్త వాళ్ళతో నేనొక సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాను. పూర్తి స్థాయి ప్రేమ కథగా ఆ చిత్రం ఉంటుంది. మిగిలిన రెండు సినిమాలకు ఎవరైన డైరెక్టర్స్ కావొచ్చు. ఇంకా డిసైడ్ కాలేదు. 

ప్రేమ అంటే కామం కాదు..

ప్రేమ కథల్లో మారిన ట్రెండ్, మారని ట్రెండ్ రెండు ఉంటాయి. ప్రేమ అంటే కామం కాదు. మనిషి కనిపించగానే ఐ లవ్ ఉ చెప్పే కథలు నేను తీయను. యూత్ కు బాగా దగ్గరగా ఉండే కథను రూపొందిస్తున్నాను. ప్రతి అమ్మాయి, అబ్బాయి జీవితంలో ఫేస్ చేసిన పరిస్థితినే తీయబోతున్నాను. నిజానికి ఈ కథ నేను ఇప్పుడు రాసుకుంది కాదు. కొన్నేళ్ళ క్రితం రామానాయుడు గారితో కలిసి తీయాలను రాసుకున్న కథ. కాని ఆయన అనారోగ్య  కారణం వలన చేయలేకపోయాం. రామానాయుడుకి బాగా నచ్చిన కథ.

మహాభారతం నా చివరి సినిమా..

మహాభారతాన్ని 5 భాగాలుగా తీయాలనేది నా ప్లాన్. ఇప్పటికే రెండు పార్ట్స్ పూర్తయ్యాయి. మూడో పార్ట్ ను సిద్ధం చేస్తున్నాను. ఎవరో మహాభారతం సినిమాను తీయబోతున్నారని విన్నాను. కాని నేను మాత్రం తీయకుండా ఉండను. దర్శకుడిగా నేను పని చేసే చివరి సినిమా ఇదే అవుతుంది.

ఆ రెండు చిత్రాలు నిరాశ పరిచాయి..

నేను సినిమాల్లో నటించడానికి దూరంగా లేను. కొంచెం గ్యాప్ తీసుకున్నాను అంతే. నేను చేసిన బెస్ట్ మూవీ 'పరమవీరచక్ర' ఫెయిల్ అవ్వడం.. మంచి పాత్ర, మంచి పెర్ఫార్మన్స్ చేసిన 'ఎర్రబస్సు' చిత్రాలు నన్ను నిరాశ పరిచాయి. గ్యాప్ తీసుకోవడానికి కారణం కూడా అదే.

ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారింది..

ప్రేమ అంటే తల్లితండ్రులను తిట్టడం, వెటకారంగా, ఎగతాలిగా మాట్లాడడం కాదు. అలా చేస్తే సినిమాలు చూడడం మానేశారు. గత రెండు సంవత్సరాలుగా ఆరోగ్యకరమైన చిత్రాలను మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారు. భలే మంచి రోజు, సినిమా చూపిస్తా మావ, కళ్యాణ వైభోగమే, క్షణం, ఊపిరి వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. సినిమాలో ఆరు ఫైట్లు, ఆరు పాటలు ఉంటే ప్రేక్షకులు చూస్తారనుకుంటే పొరపాటే..

రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయడం కరెక్ట్ కాదు..

సినిమాలు సరిగ్గా ఆడకపోతే రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయడం కరెక్ట్ కాదు. సినిమా నష్టపోతే డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థతో మాట్లాడాలి. నలభై ఏళ్ళ క్రితం డిస్ట్రిబ్యూటర్స్ పిలిచి సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చేవారు. బయ్యర్స్ నష్టపోతే హీరోలు చేయబోయే తదుపరి సినిమాలో కన్సెషన్ ఇచ్చేవారు. ఈ పద్ధతి ఎప్పటినుండో ఉంది. కొత్తగా వచ్చింది కాదు. హీరో, డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా హిట్ అయితే వారి చేయబోయే నెక్స్ట్ సినిమాను ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి కొనుక్కుంటారు. అలాంటప్పుడు ఆ సినిమాకు ఇరవై, ముప్పై శాతం నష్టం వస్తే దర్శక నిర్మాతలు, హీరోలు ఏమి చేయనక్కర్లేదు. అదే సినిమా డిజాస్టర్ అయితే మాత్రం కొంత నష్టాన్ని పూడ్చాలి. గతంలో రజినీకాంత్, అల్లు అరవింద్ ఈ విధంగానే ఇచ్చారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వినాయక్, శ్రీనివైట్ల కూడా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు డబ్బు ఇచ్చారు. మనల్ని నమ్మి సినిమా కొంటున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. డబ్బు అడగడమూ తప్పు కాదు.. ఇవ్వడమూ తప్పు కాదు.. రోడ్ కు ఎక్కడం కరెక్ట్ కాదు.

సక్సెస్ ను నిలబెట్టుకోవాలి..

సక్సెస్ అనేది సులభంగానే వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి కాని రెక్లెస్ గా ఉండకూడదు. ఈ మధ్య కొందరు దర్శకులు సక్సెస్ వచ్చింది కదా.. అని ఇష్టంవచ్చినట్లు సినిమాలు తీస్తున్నారు. అలా రెక్లెస్ గా సినిమా తీయడం కరెక్ట్ కాదు. సక్సెస్ ను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి.

రామ్ లక్ష్మణ్ లకు మంచి ఆలోచన వచ్చింది..

రీసెంట్ గా రామ్ లక్ష్మణ్ లు ఇండస్ట్రీలో సినిమా డే అనేది ఉండాలని ప్రపోజల్ పెట్టారు. నిజానికి 1932 లో  'భక్త ప్రహ్లాద' సినిమా రిలీజ్ అయింది. ఆ రోజునే తెలుగు సినిమా పుట్టినరోజుగా చాలా కాలం జరుపుకున్నాం. కాని రాను రాను అది మరుగునపడింది. రామ్ లక్ష్మణ్ లు చెప్పిన ఆలోచన నాకు నచ్చింది. 100% దానికి కృషి చేస్తాను.

సినిమా హబ్ చేయాలి..

హైదరాబాద్ ను సినిమా హబ్ చేయాలి. దీని కోసం తమిళ, కన్నడ, నార్త్, తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఇక్కడకు రావాలి. దీనికి సుమారుగా 2000 ఎకరాల్లో సినిమా హబ్ ను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం దీనికి కమిటీ వేసి మా సలహాల కోసం పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను.

ఆ షో చిన్న సినిమాలకే..

చిన్న చిత్రాలను థియేటర్స్ సమస్యలు వస్తున్నాయి. అందుకే రోజు నాలుగు ఆటలు ఉండే సినిమాను ఐదు ఆటలుగా మార్చాలని ప్రతిపాదిస్తున్నాం. ఎక్స్ క్లూజివ్ గా నాలుగు గంటల షోను చిన్న చిత్రాలకు కేటాయించాలని డిసైడ్ అవుతున్నాం. అలా చేయకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే దానికి ఆన్ లైన్ ప్రాసెస్ కావాలి. చిన్న ఊరులో ఉన్న థియేటర్లకు కూడా ఆన్ లైన్ ప్రాసెస్ రావాలి. ఇలా చేయడానికి ప్రభుత్వం సిద్ధ పడింది.

ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వాల్సిన పని లేదు..

సినిమా పరిశ్రమ అభివృద్ధి కావాలని ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగు పరిశ్రమను డెవలప్ చేయొచ్చు. దానికోసం ఇండస్ట్రీను షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సినిమాలు ఎక్కడైనా.. తీయొచ్చు. ఆ టెక్నాలజీ వచ్చేసింది. అలానే సినిమాకు సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ ను పలానా చోటే చేయాలనే డిమాండ్ లేదు. ఎక్కడైనా చేసుకోవచ్చు. గతంలో వైజాగ్, విజయవాడ, తిరుపతి ఇలా చాలా చోట్ల చేసేవాళ్ళం. 

ఇప్పుడు రాజాకీయల్లోకి వెళితే బురద చల్లించుకోవాలి..

నేను 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ చేరుతాననే వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు. ప్రస్తుతం రాజకీయ ఆలోచనలు లేవు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల వలన నేను రాజకీయాల్లోకి వెళ్ళట్లేదు. వ్యాపార వ్యవస్థగా మార్చుకుంటున్నారు. నాలా సూటిగా ఉండేవారు రాజకీయాలకు పని రారు. వెళ్ళినా.. బురద చల్లించుకొని రావాలి. నాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో మంచి సాన్నిహిత్యం ఉంది. 1978 నుండే ఆయన నాకు తెలుసు. ఆయనకు నాకు ఉన్న స్నేహంతోనే జగన్ నాతో మాట్లాడానికి వచ్చాడు. నిత్యం జనాల్లో ఉండే మనిషి జగన్. ఏదో సాధించాలనే తత్వం గలవాడు. నా సపోర్ట్ ఎప్పటికి తనకు ఉంటుంది.

భవిష్యత్తు తరాలు దెబ్బ తినే పరిస్థితి ఉంది..

ప్రత్యేక హోదా.. ఇవ్వలేకపోవడం, పార్లమెంట్ లో కూడా ఎంఓఎస్ ప్రత్యేక హోదా లేదని చెప్పడం భాధాకరం. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి. పోయిన ప్రభుత్వం ఇచ్చిన హామీను, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాలి. లేదంటే భవిష్యత్తు తరాలు దెబ్బ తినే పరిస్థితి ఏర్పడుతుంది.

ఆర్టిస్ట్స్ లేరనుకోవడం పొరపాటు..

ప్రస్తుతం వస్తోన్న చిత్రాల్లో పరభాషా నటులు ఎక్కువగా ఉంటున్నారు. కాంబినేషన్స్ వచ్చిన తరువాత ఇతర భాషల నుండి నటులను తెచ్చుకొని సినిమా చేస్తే పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని ఆలోచించడం తప్పు. మన దగ్గర ఆర్టిస్ట్స్ లేరనుకోవడం పొరపాటు. వెతికి పట్టుకోవాలి. రేర్ కేసుల్లో ఆర్తిసులను దిగుమతి చేసుకోవడంలో తప్పు లేదు. 

బరువు తగ్గాను..

డైట్ చేసి సుమారుగా 15 కిలోలు తగ్గాను.

పవన్ డెడికేషన్ ఉన్న మనిషి..

పవన్ కళ్యాణ్ కమిట్మెంట్, డెడికేషన్ ఉన్న మనిషి. తను చెప్పిన మాటకు నిలబడతాడు. అలాంటి మనిషి రాజకీయ ప్రవేశం చేయడం ఆనందకరం. అయితే త్వరలోనే సినిమా మానేస్తానని చెప్పాడు. బాధ్యతలు తీసుకున్నప్పుడు రెండు పడవల మీద ప్రయాణం చేయకూడదనేది నా భావన.

ఛానల్, పేపర్ పెట్టాలనే ఆలోచన అయితే ఉంది..

న్యూస్ పేపర్, చానెల్ పెట్టాలనే ఆలోచన అయితే ఉంది కాని చేసే మనుషులు ఎవరున్నారా..? అని ఆలోచిస్తున్నాను.

సక్సెస్ రేట్ తగ్గడానికి కారణం అదే..

సినిమా సక్సెస్ రేట్ అనేది తగ్గడానికి కారణం అనుభవం లేని నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. ఇదివరకు నిర్మాత అనేవాడికి ప్రతి ఒక్కదానిపై అవగాహన ఉండేది. ఇప్పుడున్న ఏ ఒక్క నిర్మాతకు కూడా స్క్రిప్ట్ ఏంటో కూడా తెలియదు. అనుభావరాహిత్యంగా సినిమాలు చేస్తున్నారు అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement