Advertisement

ఈనాడు, జ్యోతిల విలువలెక్కడికి పోయాయి..!

Wed 14th Oct 2015 02:18 AM
eeladu,andhra jyothi,sakshi,jagan  ఈనాడు, జ్యోతిల విలువలెక్కడికి పోయాయి..!
ఈనాడు, జ్యోతిల విలువలెక్కడికి పోయాయి..!
Advertisement

పాలిటిక్స్‌లో ఉన్న నాయకులను, రాజకీయాలను వేరు చేసి చూడలేం. వారి ప్రతి చర్య వెనుక.. మాట వెనుక ఏదో ఓ రాజకీయ లబ్ధి ఉండకమానదు. అయితే ప్రస్తుతం తెలుగునాట రాజకీయాలను.. మీడియాను వేరు చేసి చూడలేకపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఏమాత్రం దాపరికం లేకుండా తెలుగు మీడియాలో చానళ్లు, వార్త పత్రికలు ఏదో ఓ రాజకీయపక్షాన ఎప్పుడో చేరిపోయాయి. ఇది ఏస్థాయికి చేరిందంటే రాష్ట్ర ప్రతిపక్ష నేత రాష్ట్ర లబ్ధి కోసం ఏడు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షకు పట్టుమని పదిలైన్ల వార్తను కూడా ప్రచురించలేని స్థాయికి.

సాక్షితోనే తెలుగులో మీడియా ఏదో రాజకీయ పక్షం వైపు పూర్తిగా మొగ్గుచూపడం ప్రారంభమైందనే భావన ప్రజల్లో నెలకొంది. అయితే సాక్షి కంటే ముందే ఈనాడు ఈ తరహా విష సంస్కతికి తెలుగునాట ఆవిర్భావం పలికిందని సీనియర్‌ జర్నలిస్టులు చెబుతున్నారు. ఓ పత్రికకు ఎడిటర్‌ అంటూ లేకుండా పూర్తిగా యజమాన్యం చేతుల్లోనే ఉండిపోవడం మొదటగా ఈనాడుతోనే ఆరంభమైంది. మూడు దశాబ్దాలుగా ఈనాడు వార్త కథనాల ప్రచురణ ఆ పత్రిక యాజమాన్యానికి అనుకూలంగా ఉన్న వారికే మద్దతు పలుకుతూ ప్రజల్లోకే వెళ్లేవని వారు చెబుతున్నారు. ఆ పత్రిక వత్తాసు పలుకుతున్న పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా చెప్పాలి వస్తే.. అది ప్రజలకు కనబడీ కనబడనట్లు.. వినబడీ వినిపించనట్లు సాగేవి. సాక్షి రాకతో పత్రికలు చానళ్లు దాదాపు ఏదో రాజకీయపక్షంవైపు చేరిపోయాయి. మీడియాకు, రాజకీయాలకు అతీత బంధం ఏర్పడింది. పార్టీల మద్దతు లేకుండా పత్రికలు మనుగడ సాగించేలేవన్న స్థాయిలో ప్రజలు భావించే స్థితికి చేరుకుంది.

ఇక ప్రస్తుతానికి వస్తే ప్రత్యేకహోదా కోసం జగన్‌ నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్ష వెనుక రాజకీయ లబ్ధి అనేది ప్రధానంశమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కాని ఆయన ఏ కారణంతో చేస్తున్న రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి.. పోరాటం చేస్తున్నాడన్నది సుస్పష్టం. కాని ఇది ప్రభుత్వంలో ఉన్న పార్టీకి మద్దతు తెలుపుతున్న మీడియాకు ఏమాత్రం రుచించడం లేదు. రాష్ట్ర ప్రతిపక్ష నేత వారం రోజులుగా దీక్ష చేస్తున్న ఆ పత్రికలకు పట్టడం లేదు. ఇక విలువలకు సంబంధించి వార్తలు ప్రచురించడానికి ముందుండే ఆయా పత్రికల విలువలు ఇప్పుడు ఎక్కడికి పోయాయన్న అనుమానం తలెత్తకమానదు. దశాబ్దాలుగా అభిమానులుగా మారిన పాఠకుల దృష్టిలో కూడా ఆయా పత్రికల స్థాయి పడిపోతుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement