ప్రపంచానికి ముంచుకొస్తున్న ముప్పు!
Global Financial Stability Reportప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణ వేగంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. యుఎస్ అధికారిక పరిశోధనా సంస్థ `నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్` వార్నింగ్ ని పరిశీలిస్తే.. ఈ మే - జూలై నెలల్లో భీకర `ఎల్ నినో` ఏర్పడటానికి వందలో మూడొంతులు ఆస్కారం ఉందని అంచనా. ఈ ఏడాది చివరి నాటికి ఎండ మంటలు అంతకంతకు పెరుగుతాయే కానీ తరగవు.. 2027 మార్చి వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా.
వాతావరణ నమూనాల ప్రకారం.. ఓషియన్ నినో ఇండెక్స్ 3 డిగ్రీల సెంటిగ్రేడ్ మార్కును దాటే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణ చరిత్రలో గతంలో జనవరి 1878లో మాత్రమే ఈ స్థాయి తీవ్రత నమోదైంది. నాటి విపత్కర పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన కరవు కాటకాలకు, దాని అనుబంధ ఆకలి చావులకు దారితీసిన నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు గ్లోబల్ కమ్యూనిటీని భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
ఈ చారిత్రాత్మక తీవ్రత గల ఎల్ నినో ప్రభావంతో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో విపరీతమైన వేడి, కరవు పరిస్థితులు ఏర్పడి వాతావరణం పూర్తిగా అస్తవ్యస్తం కానుంది. ఇది అడవి మంటల ముప్పును పెంచడమే కాకుండా.. సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల పగడపు దిబ్బలు విరవబడటం వంటి తీవ్ర పర్యావరణ నష్టాలకు కారణమవుతుంది. ఈ విపరీత మార్పులు నేరుగా వ్యవసాయ రంగంపై తీవ్ర ఒత్తిడిని తీసుకువచ్చి, ప్రపంచ ఆహార భద్రతను, ప్రజారోగ్యాన్ని కోలుకోలేని దెబ్బతీసే ప్రమాదం ఉంది. గత శతాబ్దపు ఘోర ఉదంతాలతో పోలిస్తే నేడు ప్రపంచ దేశాలు టెక్నికల్ గా మెరుగైన సంసిద్ధతతో ఎదిగినా.. ఈ స్థాయి సుదీర్ఘ విపత్తును తట్టుకోవడం అంత సులువు కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అంతర్జాతీయ ప్రభుత్వాలు, విపత్తు నిర్వహణ సంస్థలు తీవ్రమైన వనరుల కొరతను ఎదుర్కొనే ముప్పు ఉన్నందున మానవతా సంక్షోభాన్ని-ఆకలి కేకలను నివారించడానికి తక్షణమే వ్యూహాత్మక వనరులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరుసగా రెండు సంవత్సరాలు నీళ్లు కరువై పంటలు పండకపోతే ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించుకుంటే ఎవరికైనా ఈ కరువు కాటకాల ప్రభావం ఎలా ఉంటుందో అర్థమవుతుంది.







































