తారలు.. పెద్ద మనసు చాటుతున్నారు!

ఈమధ్యకాలంలో విశాఖ హుదూద్ తుఫాన్, కేరళ వరదలు, తిత్లీ తాజాగా గజ తుపాన్ వంటి ప్రకృతి సంబంధిత విపత్తుల సమయంలో బడా బడా రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, అధికారులు కూడా నిర్లిప్తతతో వ్యవహరిస్తూ ఉంటే సినిమా వారు మాత్రం వారి కంటే మిన్నగా స్పందిస్తున్నారు. నిజానికి సామాన్యులైన అమరావతి భూముల రైతులు కూడా తిత్లీ తుఫాన్ బాధితుల కోసం భారీగా విరాళం అందించారు.
ఇక విషయానికి వస్తే తమిళ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీలకు ఎంతో గొప్ప మనసు ఉందని అందరికీ తెలుసు. అభిమానుల పట్ల వారు చూపే ఆదరణతో పాటు ప్రతి విషయంలోనూ వీరు ఎంతో వినయవిధేయతలు, పెద్దమనసు చాటుకుంటూ ఉంటారు. ఆమధ్య సూర్య, ఆ తర్వాత కార్తి కూడా అభిమానుల అత్యుత్సాహాన్ని నివారించే ప్రయత్నం చేశారు. కానీ ఇటీవల వీరి తండ్రి, వెటరన్ యాక్టర్ శివకుమార్ మాత్రం మధురైలో ఓ షాప్ ఓపెనింగ్కి వెళ్లి అక్కడ తనతో ఫొటో తీసుకోవాలని ఆశ పడిన అభిమాని మీద చేయి చేసుకుని, సెల్ఫీ తీయబోయిన మొబైల్ని విసిరికొట్టాడు. దాంతో శివకుమార్పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక విషయానికి వస్తే తమిళనాడులో గజ తుపాన్ కారణంగా ఏకంగా 20మంది మృత్యువాత పడగా, 80వేల మందికి పైగా కూడు, గూడు, గుడ్డని కోల్పోయారు. దీంతో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ‘గజిని’ ఫ్యామిలీ ముందుకు వచ్చింది. తమ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా 50లక్షల విరాళం ప్రకటించింది. ఈ విషయాన్ని సూర్య స్నేహితుడు రాజశేఖర్ పాండియన్ ట్విట్టర్లో వెల్లడించాడు.ఈ విషయాన్ని సూర్య ధృవీకరించాడు. ఈ మొత్తాన్ని ఎన్జీవో ద్వారా ఖర్చుచేయనున్నట్లు ప్రకటించాడు. గతంలో కేరళ వరదల సందర్భంగా కూడా గజిని ఫ్యామిలీ తమ పెద్దమనసును చాటుకుంది. 25లక్షల రూపాయల చెక్కును కేరళ సీఎం విజయన్కి కార్తి అందజేసిన విషయం తెలిసిందే.
Sivakumar, Suriya and Karthi donate Rs 50 Lakhs for Gaja cyclone relief
Celebrities Helps Gaja Cyclone Victims








































