Advertisement

టాలీవుడ్ పై మోహన్ లాల్ మెరుపు దాడి..!

Tue 22nd Nov 2016 09:15 PM
mohan lal,rajinikanth,tollywood,manamantha,janatha garage  టాలీవుడ్ పై మోహన్ లాల్ మెరుపు దాడి..!
టాలీవుడ్ పై మోహన్ లాల్ మెరుపు దాడి..!
Advertisement

రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, మమ్ముట్టి... వీరు తెలుగుపై ఎప్పటి నుండో దృష్టి పెట్టారు. కానీ మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నిన్నమొన్నటి వరకు టాలీవుడ్‌పై పెద్దగా దృష్టిపెట్టలేదు. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, బాలకృష్ణలు కలిసి నటించిన 'గాండీవం' చిత్రంలో ఓ పాటలో తళుక్కున మెరిశాడు. 'యోధ' వంటి చిత్రాలతో అప్పుడప్పుడు తెలుగులోకి ఆయన నటించిన మలయాళ చిత్రాలు డబ్బింగ్‌ అయినా ఆయనకు తెలుగులో పెద్దగా క్రేజ్‌ రాలేదనే చెప్పాలి. కానీ ఇటీవల ఆయన రెండు తెలుగు చిత్రాలలో నటించాడు. ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన 'జనతాగ్యారేజ్‌'చిత్రంలో కీలకమైన పాత్రను చేశాడు. ఈ చిత్రం సూపర్‌హిట్‌ అయింది. ఇక చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఆయన నటించిన మరో తెలుగు చిత్రం 'మనమంతా' చిత్రం పెద్దగా కమర్షియల్‌ హిట్‌ కాకపోయినా ఈ చిత్రం చూసిన వారు మాత్రం మోహన్‌లాల్‌ నటనకు ముగ్డులైపోయి ఆయన ఫ్యాన్స్‌గా మారిపోయారు. ఇలా వరసగా రెండు టాలీవుడ్‌ చిత్రాలలో నటించిన ఆయన ఇప్పుడు తెలుగుపై మరింత దృష్టి సారించాలని, ఇక్కడ తనకున్న మార్కెట్‌ను పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. 

ఇటీవల తాను మలయాళంలో చేసిన బ్లాక్‌బస్టర్‌ 'పులిమురుగన్‌' చిత్రం దాదాపు 100 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఆయన ఈ చిత్రాన్ని తెలుగులో 'మన్యం పులి' పేరుతో డబ్బింగ్‌చేస్తున్నాడు. ఈ తెలుగు వెర్షన్‌ను సింధూరపువ్వు కృష్ణారెడ్డితో కలిసి తాను కూడా భాగస్వామిగా ఉంటూ, స్లీపింగ్‌ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తూ, తెలుగులో డబ్‌ చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ మసాలా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం కనిపిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని డిసెంబర్‌2న విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇక ఇటీవల మోహన్‌లాల్‌ నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ 'ఒప్పం' కూడా మలయాళంలో ఘనవిజయం సాధించి, 'ప్రేమమ్‌' రికార్డులను బద్దలుకొట్టి, వైవిధ్యభరిత చిత్రాలను ఇష్టపడే వారిని విపరీతంగా ఆకర్షించింది. కాగా ఈచిత్రం తమిళ రీమేక్‌లో కమల్‌హాసన్‌, హిందీ రీమేక్‌లో అక్షయ్‌కుమార్‌లు నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ చిత్రం బెంగాళీ వెర్షన్‌ రీమేక్‌ హక్కులను ఓ కార్పొరేట్‌ సంస్థ తీసుకోగా, కన్నడలో కూడా ఈ చిత్రం రీమేక్‌ హక్కులు అమ్ముడైపోయాయి. ఓ కన్నడ హీరో నటించనున్న ఈ చిత్రానికి ఓ తెలుగు డైరెక్టర్‌ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తే నటించడానికి నాగార్జున, వెంకటేష్‌ వంటి సీనియర్‌ స్టార్స్‌, సాయి కొర్రపాటి, డి.సురేష్‌బాబు వంటి స్టార్‌ప్రొడ్యూసర్స్‌ ఆసక్తి చూపించినా, ఈ చిత్రాన్ని కూడా కేవలం తెలుగులో డబ్బింగ్‌ చేసి విడుదల చేయాలని మోహన్‌లాల్‌ నిర్ణయానికి వచ్చేశాడు. దీంతో 'ఒప్పం' రీమేక్‌లో నాగార్జున, వెంకటేష్‌ వంటి స్టార్స్‌ నటిస్తారనే వార్తలకు తెర పడింది. ఆ ఇద్దరు హీరోల ఆశలను మోహన్‌లాల్‌ వమ్ము చేశాడు. ఇందులో మోహన్‌లాల్‌ గుడ్డివాడైన ఓ లిఫ్ట్‌బోయ్‌గా నటించాడు. కాగా ఈ చిత్రం డబ్బింగ్‌ వెర్షన్‌ను కూడా డిసెంబర్‌ మూడో వారంలో విడుదల చేయాలని మోహన్‌లాల్‌ నిర్ణయించుకున్నాడు. ఈచిత్రాన్ని కూడా ఆయన తన భాగస్వామ్యంలోనే మరో తెలుగు నిర్మాణ సంస్థతో కలిసి డబ్బింగ్‌ చేసి రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement